రాహుల్పై కవిత విమర్శ: ఆమె అహంకారానికి నిదర్శనమన్న జీవన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖండించారు. నరేంద్రమోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే ప్రయత్నంలో భాగంగానే ఎంపీ కవిత రాహుల్ను విమర్శిస్తున్నారని ఆరోపించారు.
శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పాపాలు కడుకొనేందుకు రాహుల్ గాంధీ పుష్కర స్నానాలు చేయాలని కవిత అనడం ఆమె అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పినప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో వెయ్యి మంది రైతుల ఆత్మహత్యల పాపం టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం కేసీఆర్, అందులో రైతుల వాటా ఎంతో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.