చెప్పులతో దాడి చేసుకున్న కౌన్సిలర్లు!, 'చరిత్రలో ఇదే ప్రథమం'
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ఎంఐఎం పార్టకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చెప్పులతో ఒకరిపై ఒకరు సోమవారం దాడి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోఫియా, ఫసియుద్దీన్ల మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత తగాదాలున్నాయి.
ఈ క్రమంలో సోమవారం కౌన్సిల్ సమావేశంలో సర్వే నెంబర్ 128 స్థల విషయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఇలా ఇద్దరూ ఆగ్రహావేశానికి లోనై చివరకు చెప్పులు తీసుకొని దాడి చేసుకున్నారు.
వీరిద్దరి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకున్న సమయంలో తోటి కౌన్సిలర్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇది ఇలా ఉంటే కౌన్సిల్ చైర్ పర్సన్ తీసుకున్న నిర్ణయాలను వైస్ చైర్పర్సన్తో పాటు పలువురు కౌన్సిలర్లు తప్పుబట్టడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది.
కేసీఆర్ వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి: జీవన్రెడ్డి
తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాయడం సిగ్గుచేయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యహ్నం ఆయన కరీంనగర్ జిల్లా రాయికల్లో మీడియాతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించమని రాష్ట్రాన్ని కేంద్రం కోరడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు.
ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి వెంటనే కరువు మండలాలను ప్రకటించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.