మోడీకి కేసీఆర్ ఏజెంట్లా పనిచేస్తున్నారు!: జీవన్ రెడ్డి
ప్రధాని ఏమైనా దేవుడా? ఆయన నిర్ణయాలు తప్పుబట్టరాదా? అంటూ కేసీఆర్ ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: ప్రజలకు ఏజెంట్ లా వ్యవహరించాల్సిన సీఎం ప్రధానికి ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నాయకుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యవహార శైలి మోడీ ఏజెంట్ ను తలపించేలా ఉందని ఎద్దేవా చేశారు.
శుక్రవారం నాడు అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, వారిద్దరి మధ్య జరిగిన చర్చల ఆంతర్యమేంటో తెలియాలని జీవన్ రెడ్డి అన్నారు.
బీజేపీతో పొత్తు కలుపుకునే ఉద్దేశ్యంతో ప్రజలను బలిపెట్టేందుకు కేసీఆర్ సిద్దపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రధాని ఏమైనా దేవుడా? ఆయన నిర్ణయాలు తప్పుబట్టరాదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడటం కోసమే పెద్ద నోట్ల రద్దు అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేక బ్యాంకులు, ఏటీఎం క్యూ లైన్లలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించాలని తమ పార్టీ చేసిన సూచనను టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
నగదు రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని చెబుతున్న కేసీఆర్ కు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో 10శాతం జనాభా బ్యాంకులు, ఏటీఎంల క్యూ లైన్లలోనే నిలబడాల్సిన దుస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.