కాపు కాసి పెళ్లి చూపుల రోజే చంపేసిన భగ్న ప్రేమికుడు
హైదరాబాద్: ఏ ప్రేమ వ్యవహారం దారుణ హత్యకు దారి తీసింది.తనకు దక్కని యువతి మరొకరికి దక్కకూడదనే ఉద్దేశంతో మాజీ ప్రేయసిని దారుణంగా చంపేశాడు. పెళ్ళిచూపుల రోజే కాపుకాసి హత్యకు పూనుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాదు నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
న్యూ హఫీజ్పేటలోని మార్తాండ నగర్లో నివసిస్తున్న సెంట్రింగ్ కార్మికుడు గౌస్పాషా (26) అదే బస్తీలో నివసిస్తున్న ఓ యువతిని రెండేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. అయితే కొంతకాలం నుంచి రాజస్థాన్ లోని ఈటా జిల్లా, అలిపూర్కు చెందిన షరాఫత్తో ఆ యువతి ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. అదే బస్తీలో ఉంటున్న తన మేనమామ వద్ద గ్లాస్ వర్క్ షాపులో పనిచేస్తున్న అతను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు.
కాగా శుక్రవారం తల్లిదండ్రులను తీసుకుని తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రేమికుడు గౌస్పాషా అతన్ని ఎలాగైనా మట్టుపెట్టాలనుకున్నాడు. షరాఫత్ కోసం కాపుకాశాడు. బయటికి వచ్చిన షరాఫత్కు మాయమాటలు చెప్పి నమ్మించి మార్తాండ నగర్లోని దర్గా సమీపంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయితో తలపై మోది దారుణంగా చంపేశాడు.
ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూకట్పల్లి ఏసిపి భుజంగరావు, మియాపూర్ ఇన్స్పెక్టర్ రమేష్ కొత్వాల్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. హతుడి తండ్రి మఫోజ్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు మియాపూర్ ఇన్స్పెక్టర్ కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.