జెఎన్యు రగడ: కన్నయ్యకోసం లెఫ్ట్, రంగంలోకి బిజెపి ఎస్సీ మోర్చా
హైదరాబాద్/ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు)లో జరిగిన ఘటన పైన ఆదివారం నాడు హైదరాబాదులో పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. లెఫ్ట్ పార్టీలు జెఎన్యు విద్యార్థి కన్నయ్య కుమార్ విడుదలకు డిమాండ్ చేస్తూ, బిజెపి ఎస్సీ మోర్చా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ తీశాయి.
ఇదిలా ఉండగా, జెఎన్యు 'దేశ వ్యతిరేక కార్యక్రమాలను' నిరసిస్తూ మాజీ సైనికుల నేతృత్వంలో వేలాది మంది ప్రజలు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. రాజ్ఘాట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జంతర్ మంతర్ వరకు కొనసాగింది. త్రివర్ణ పతాకాలు ప్రదర్శిస్తూ వందేమాతర నినాదాలు చేశారు.
'భారత్ను ఏకం చేయండి' అనే సకారాత్మక నినాదంతో ర్యాలీని నిర్వహించినట్లు నిర్వాహకుల్లో ఒకరైన మేజర్ జనరల్ (విశ్రాంత) ధ్రువ్ సీ కతోచీ తెలిపారు. ఈ ర్యాలీతో బిజెపి, ఆరెస్సెసలకు సంబంధం లేదని ముందే నిర్వాహకులు ప్రకటించారు.
బిజెపి ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, కైలాస్ విజయ్ వర్జియాలు ర్యాలీని అభినందిస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో చాలా కాలం నుంచి జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని బిజెపి ప్రభుత్వం వీటిని ఎంతమాత్రం సహించదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ స్పష్టం చేశారు.
మరోవైపు, దేశద్రోహం కేసు నమోదైన నలుగురు జేఎన్యూ విద్యార్థులు విశ్వవిద్యాలయంలో తలదాచుకున్నారని సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై జెఎన్యు అధికారులను పోలీసులు సంప్రదించినప్పుడు వారు ఇక్కడ ఉన్నట్లు సమాచారమేది లేదని తెలిపారు.
లెఫ్ట్ పార్టీలు
జెఎన్యులో అరెస్టు చేసిన కన్నయ్య కుమార్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండు వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద లెఫ్ట్ పార్టీల నిరసన.
లెఫ్ట్ పార్టీలు
జెఎన్యులో అరెస్టు చేసిన కన్నయ్య కుమార్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండు వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద లెఫ్ట్ పార్టీల నిరసన.
బిజెపి ఎస్సీ మోర్చా
కొందరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని సహించవద్దని బిజెపి ఎస్సీ మోర్చా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్కు పాలాభిషేకం చేస్తున్న దృశ్యం.
బిజెపి ఎస్సీ మోర్చా
జెఎన్యులో దేశ వ్యతిరేకంగా సాగుతున్న విద్రోహ చర్యలను ఖండిస్తూ తాము పాలాభిషేకం చేస్తున్నట్లు బిజెపి ఎస్సీ మోర్చా తెలిపింది.