జర్నలిస్ట్ రఘును అక్రమంగా అరెస్టు చేసారు.!కేసీఆర్ ఖాసిం రజ్విని మరిపిస్తున్నారన్న దాసోజు శ్రవణ్.!
హైదరాబాద్ : ప్రజాస్వామ్యానికి మూలస్థంభం జర్నలిజం అని భావించే కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టుని పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేసారు. జర్నలిస్ట్ అనేవాడు ఓ సామాజిక సైనికుడు అని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రఘుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖడించడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టు పక్షాన నిలుస్తుందని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా రఘు అక్రమ అరెస్ట్ పై ఆధారాలు చూపుతూ సిసి టీవీ పుటేజ్ ని మీడియాకి ప్రదర్శించారు దాసోజు శ్రవణ్.
జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్.. ఖాసిం రజ్వీ గా మారిన కేసీఆర్ అన్న దాసోజు శ్రవణ్..
ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేడు ఒక ఉన్మాద పార్టీకి మారిందని, ఆ ఉన్మాద చర్యల్లో బాగంగానే ప్రముఖ జర్నలిస్ట్ రఘుని అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచికత్వాన్ని చాటుకుందని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. పోలీసులు మాటు వేసి, మఫ్టీలో వచ్చి, ఒక టెర్రరిస్ట్ ని అదుపులోకి తీసుకున్నట్లు జర్నలిస్ట్ రఘు ని ముసుగు వేసి కిడ్నాప్ చేయడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియంత పాలనుకు అద్దం పడుతుందని మండిపడ్డారు. ఇలాంటి చర్యకు పూనుకున్న పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలని దాసోజు శ్రవణం ఆగ్రహం వ్యక్తం చేసారు.
గులాబి పార్టీకి గులామ్ లా మారిన తెలంగాణ పోలీసులు.. తీవ్ర స్దాయిలో మండిపడ్డ శ్రవణ్..
అంతే కాకుండా రఘు అరెస్ట్ వ్యక్తి అరెస్ట్ కాదని స్వేఛ్చకు సంకెళ్ళుగా భావించాలని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేసారు. భావ ప్రకటన స్వేఛ్చని కాలరాసినట్లేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతులో కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణ చైతన్య వంతమైన సమాజమని, రజాకార్లని తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ ఈ గడ్డకుందని, ఒక్కసారి ఒక్కడి ప్రజలు తిరగబడితే, టీఆర్ఎస్ అధినాయకత్వం, ఈ ప్రాంతం వదిలి వెళ్ళాల్సివుంటుందని దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తప్పుని ప్రశ్నించడమే రఘు చేసిన తప్పా ? సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్..
తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు తెలిసిన వ్యక్తి రఘు, చురుకైన జర్నలిస్ట్ అని, నిజాయితీగా వ్యవహరిస్తూ ఒక సోషల్ సోల్జర్ గా మీడియాలో సేవలు అందిస్తున్న రఘుని శారీరిక హింసకి గురి చేస్తూ కాళ్ళు చేతులు కట్టేసి జీపులో పడేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఉన్మాద పాలనకు నిదర్శనమని, ఆదిపత్యం, అహంకారం, అణిచివేత, అవినీతి అనే నాలుగు స్తంభాల పై టీఆర్ఎస్ పాలన సాగుతుందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును అధికార పార్టీ తన ధన, అధికార మదంతో నొక్కేయాలని చూస్తుందని, దీనికి నిదర్శనమే రఘు అక్రమ అరెస్ట్ అని దాసోజు శ్రవణ్ వెల్లడించారు.
పోలీసులు తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ..ఎఫ్ఐఆర్ రాసిన తీరుకు సిగ్గుపడాలన్న శ్రవణ్.
రఘుని అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే షోయబ్ ఉల్లాఖాన్ గుర్తుకు వచ్చారని, ఆనాడు నిజాంకి వ్యతిరేకింగా వార్తలు రాసినందుకు అక్కసుతో షోయబ్ ఉల్లాఖాన్ చేతులని కాసిం రజ్వీ నరికించాడని, ఈవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కూడా కాసిం రజ్వీ కంటే అద్వానంగా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. కల్వకుంట్ల కాసిం రజ్వీ గా వ్యవహరిస్తున్నారని, మీడియాని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పార్టీలని బెదిరించారు, నాయకులని బెదిరించారు. ఓటర్లని ప్రలోభాలకు గురి చేశారు. మీడియా సంస్థలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆఖరికి న్యాయంగా పని చేసే జర్నలిస్టులని కూడా పని చేయనువ్వకుండా గొంతు నొక్కేయాలని చూస్తున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసారు దాసోజు శ్రవణ్.