అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ పుట్టుకపై అవమానకర వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇండియన్ పీనల్ కోడ్ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

హిమంత బిస్వ శర్మపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు
మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయ సలహా తీసుకుని హిమంత బిస్వ శర్మపై సెక్షన్ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం) కింద, భారతీయ శిక్షాస్మృతిలోని 505(2) (తరగతుల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దురభిమానాన్ని సృష్టించే లేదా ప్రోత్సహించే ప్రకటనలు చేయడం) క్రింద కేసులు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు
ఉత్తరాఖండ్లో జరిగిన బహిరంగ సభలో అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై ఉద్దేశపూర్వకంగా మరియు రాజకీయ మైలేజీని పొందేందుకు ముందస్తు ప్రణాళికతో అసభ్యకరమైన ప్రసంగం చేశారని రేవంత్ రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని తక్షణమే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఎందుకు ఆదేశించలేదు ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, బిజెపి వెంటనే ముఖ్యమంత్రి పదవి నుండి హిమంత బిస్వ శర్మను తొలగించాల్సింది పోయి ఆయన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నారని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమంత బిస్వ శర్మ
హిమంత బిస్వ శర్మ, తన ప్రసంగంలో, రాహుల్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడని రుజువును ఎప్పుడైనా డిమాండ్ చేశామా అంటూ వ్యాఖ్యలు చేశారు . 2016 సెప్టెంబర్లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ను రుజువు చేయాలని డిమాండ్ చేసినందుకు ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పాటు, అస్సాం సిఎం వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రస్థాయిలో అస్సాం సీఎంపై ధ్వజమెత్తారు. యాదాద్రి-భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీపై అస్సాం సీఎం కౌంటర్ చేసిన ప్రకటనను కెసిఆర్ కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications