తోక ముడిచారు, ఫంక్షన్ హాల్ బుక్ చేయండి: జూపల్లి, వందమంది వచ్చినా సరే: రావుల
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చర్చకు సవాల్ విసిరి, ఇప్పుడు తోక ముడిచారని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఎద్దేవా చేశారు. అసెంబ్లీ కమిటీ హాలుకు వచ్చేందుకు అనుమతి కావాలని వారు చెబుతున్నారని, కాబట్టి ఏదో ఒక ఫంక్షన్ హాల్లో చర్చకు సిద్ధమని, సమయం, తేదీ ఫిక్స్ చేయాలన్నారు.
తెలంగాణ టిడిపి నేతలు మాటలకే పరిమితమయ్యారన్నారు. పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు రాశారని, దానిని తాను నిరూపించేందుకు సిద్ధమన్నారు. ప్రాజెక్టు కోసం రూ.7,500 కోట్లకు పట్టుమని పదికోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, దీని పైనా తాను చర్చకు సిద్ధమన్నారు.
హైదరాబాదులో ఏ ఫంక్షన్ హాలు అయినా తాను సరే సిద్ధమన్నారు. పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటారని చెప్పారు. మీరు పారిపోతే ప్రజలు వదిలి పెట్టరని అన్నారు. ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. నా మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు.
మీకు చర్చకు వచ్చేందుకు దమ్ము, ధైర్యం లేకుంటే.. కనీసం పాలమూరు ఎత్తిపోతలకు తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో కేంద్రానికి లేఖ రాయించాలని సవాల్ చేశారు. హైదరాబాదుకు తాగునీరు ఇచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేస్తుంటే, మీరు కుట్రలు చేస్తే ఎలాగన్నారు.
రావుల కౌంటర్
జూపల్లి కృష్ణారావు సీరియల్ డ్రామాలు ఆడుతున్నారని రావుల చంద్రశేఖర రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ కమిటీ హాల్కు తాము ఎలా వెళ్లగలమన్నారు. జూపల్లితో తాము చర్చకు సిద్ధమన్నారు. తమను సంప్రదించాక చర్చా వేదికను నిర్ణయించాలన్నారు. వందలమంది వచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు.