ఇక్కడే ఉంటా, ఎవరొచ్చినా సరే: జూపల్లి, తెగని సవాళ్ల పర్వం
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకంపై చేసిన సవాల్కు తాను కట్టుబడి ఉన్నానని తెలంగాణ భారీ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఉంటానని, టిడిపి నాయకులు ఎవరు వచ్చినా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన మీడియాతో చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టిడిపి నేతలు చేసిన విసిరిన సవాల్కు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిధులు వెచ్చించినట్లు చెబుకుంటున్న టిడిపి శాసనసభ్యులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ కమిటీ హాల్లో జులై 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి చర్చకు సిద్ధంగా ఉంటానని ఆ లేఖలో చెప్పారు. ఈ తేదీలు, సమయాలు టిడిపి నేతలకు అసౌకర్యంగా ఉంటే వారు నిర్ణయించే సమయానికి ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు.
టిడిపి నేతలు రాకపోవడంతో జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర శాసనసభా పక్షం (టిఆర్ఎస్ఎల్పి) కార్యాలయానికి చేరుకున్నారు.