'ఆంధ్రప్రదేశ్కు రేవంత్ మద్దతు', 'కోదండని చూసి గర్వించేవాళ్లం కానీ'
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన మంత్రి జూపల్లి కృష్ణా రావు మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి కొడంగల్కు పట్టిన శని అని విమర్శించారు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన శని అన్నారు.
జూపల్లి మహబూబ్నగర్లో పర్యటించారు. జొన్నలబవడ ప్రాంతంలోని కల్వకుర్తి రెండో లిఫ్ట్ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి తనకిష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఏపీకి మద్దతు పలుకుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి పాలమూరు లిఫ్ట్ను అడ్డుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస, టిడిపి నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రాజెక్టులు పూర్తై శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు రాగానే అక్కడి అచ్చంపేట, నాగర్కర్నూల్ కొల్లాపూర్ ప్రాంతాలకు నీళ్లు అందుతాయన్నారు.
కోదండను చూసి గర్వపడేవాళ్లం కానీ: టిఆర్ఎస్ అదిలాబాద్ జిల్లా చీఫ్
ఆచార్య కోదండరాం తమ జిల్లాకు చెందినవాడు కావడంతో గతంలో తామెంతో గర్వపడే వాళ్లమని తెరాస ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు లోక భూమా రెడ్డి మంగళవారం అన్నారు. కానీ ఇప్పుడు, సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం చేసిన వ్యాఖ్యలతో జిల్లావాసులు సిగ్గుపడుతున్నారన్నారు.
కోదండరాం మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తనకు తాను మేధావిగా భావిస్తూ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కోదండరాం ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.