ఉనికి కోసమే విమర్శలు: జూపల్లి, అణచివేస్తున్నారన్న రావుల
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత అయిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో టిఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ... ఉనికిని కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్ విమర్శులు చేస్తుందని ఆరోపించారు.
వచ్చే ఆగస్టునాటికి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అనుమానాలు అక్కర్లేదన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించిందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణం కోసమే ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భీమా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని మంత్రి నిలదీశారు.
అణచివేస్తున్నారు: రావుల
రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణచివేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో నిర్వహించిన మీడియా సమావేశలంలో మాట్లాడారు.
తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని... ఏకస్వామ్య ప్రభుత్వమని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులపైన ఎందుకు మాట్లాడటం లేదో.. ముఖ్యమంత్రి కెసిఆర్ జవాబు చెప్పాలని రావుల ప్రశ్నించారు.
అవినీతి పాలనతో సిఎంలపై వ్యతిరేకత: పాల్వాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలనతో తెలుగు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో పాల్వాయి మాట్లాడుతూ... ఈ రెండు రాష్ట్రాలలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా... ఇద్దరు సీఎంలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
పుష్కరాలను ప్రచార ఆర్భాటం కోసమే ఇద్దరు సీఎంలు పని చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని ఇరిగేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని పాల్వాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆయన నిలదీశారు.
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదనీయంకాదని కూడా కమిటీ చెప్పిందన్నారు. అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరడం ప్రజలను మభ్యపెట్టడమే అని కేసీఆర్పై పాల్వాయి మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న మేరకే ప్రాణహిత- చేవెళ్ల కట్టాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు.