సీజేగా జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణ స్వీకారం - రాజ్ భవన్ లో సీఎం కేసీఆర్..!!
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాదే ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ తమిళిసై నూతన సీజేతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు...ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు హాజరయ్యారు. దాదాపు 13 నెలల తరువాత సీఎం కేసీఆర్ రాజభవన్ మెట్లెక్కారు. ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం వేళ ఈ చర్చ ఆసక్తి కరంగా మారింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టస్ అలోక్ అరాదే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ తమిళిసై కొత్త సీజేతో ప్రమాణం చేయించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావటంతో ఆయన స్థానంలో జస్టస్ అలోక్ అరాదే నియామకం జరిగింది. జస్టిస్ అలోక్ అరాధే స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. ఆయన 1964 ఏప్రిల్ 13న రాయపుర్లో జన్మించారు. 1988 జులై 12న అడ్వొకేట్గా తన పేరును నమోదుచేసుకున్నారు. 2007లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2011 ఫిబ్రవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందగా.. 2016 సెప్టెంబరు 16న జమ్మూకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

2018 మే 11 నుంచి ఆగస్టు 10 వరకు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018 నవంబరు 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2022 జులై 3 నుంచి అక్టోబరు 15వరకు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక సీజేగా పని చేశారు. నూతన సీజే పమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. 2022 జూన్ 28 తర్వాత.. అంటే 13 నెలల అనంతరం రాజ్భవన్కి సీఎం కేసీఆర్ రావటం ప్రత్యేకార్షణగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టటంతో ప్రభుత్వం న్యాయస్థానం ఆశ్రయించింది. ఆ తరువాత గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించారు. కొంత కాలంగా తిరిగి రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య గతం కంటే భిన్నంగా సన్నిహిత వాతావరణం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications