Justice Served: సీన్ రీకన్స్ట్రక్షన్: సైదాబాద్ నిందితుడి మృతదేహం లభించడం పట్ల ఫుల్ ఖుష్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీ హత్యాచారం కేసు నిందితుడు పళ్లంకొండ రాజు మృతదేహం లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు లభించింది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుడిచేతి మీద ఉన్న మౌనిక అనే టాటూతో ఆ మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్ధారించారు. పోస్ట్మార్టమ్ కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
The beast: సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం లభించడంపై స్పందించిన మంత్రి కేటీఆర్
సోషల్ మీడియా షేక్ అయ్యే స్థాయిలో
ఈ సమాచారం తెలిసిన వెంటనే సోషల్ మీడియా షేక్ అయ్యే స్థాయిలో నెటిజన్లు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోన్నారు. తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తమ కామెంట్స్తో అటు ఫేస్బుక్, ఇటు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను హోరెత్తిస్తోన్నారు. ట్వీట్లు, రీట్వీట్లతో మోత మోగిస్తోన్నారు. రాజు కామానికి బలయిన ఆరేళ్ల చిట్టితల్లికి న్యాయం జరిగిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
ఆత్మహత్యగా కాకుండా..
చాలామంది నెటిజన్లు.. రాజు మృతదేహం లభించడాన్ని ఆత్మహత్యగా కాకుండా.. ఎన్కౌంటర్ అనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిందితుడు రాజు -ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారాన్ని ఎవరూ కూడా పెద్దగా విశ్వసించట్లేదు. పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు.. పరోక్షంగా. ఏదేమైనప్పటికీ- ఆ చిన్నారి ఆత్మకు శాంతి లభించి ఉంటుందని పేర్కొంటున్నారు.
మంచు మనోజ్.. రామ్ పోతినేని
జస్టిస్ సర్వ్డ్ (Justice Served) అనే ట్యాగ్ సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. వేలాదిమంది ట్వీట్లు చేస్తోన్నారు. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, రామ్ పోతినేని సైతం.. రాజు మృతదేహం లభించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజు మృతదేహం లభించినట్లు మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు రెస్పాండ్ అవుతున్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మంచు మనోజ్.. స్వయంగా సింగరేణి కాలనీకి వెళ్లి ఆ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా- దేవుడు ఉన్నాడంటూ మంచు మనోజ్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు.
Recommended Video
అసలు హీరో ఆయనే..
నిందితుడు రాజు మృతదేహం రైలు పట్టాలపై లభించడాన్ని ఆత్మహత్యగా భావించట్లేదంటూ కొందరు ట్వీట్లు చేస్తోన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సీినియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను అభినందిస్తున్నారు నెటిజన్లు. ఆయనను హీరోగా కీర్తిస్తున్నారు. మరి కొందరు మాత్రం- రాజు ఎలా మరణించినా గానీ ఆ చిన్నారి ఆత్మకు శాంతి లభించిందని అంటున్నారు. మరోకరు ఇలాంటి దారుణాలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా చేశారని హర్షిస్తున్నారు. ఎలాంటి సీన్ రీకన్స్ట్రక్షన్ లేకుండా అతని మృతదేహం లభించడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతున్నారు.