తమిళ పోలీసులు ఏపీలో ప్రవేశిస్తే సమ్మతమేనా?: సెక్షన్-8పై జస్టిస్ సుదర్శన్
హైదరాబాద్: సెక్షన్-8 ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థలకు, దేశ సమైక్యతకు విరుద్ధమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ విద్యావంతుల వేదిక (టివివి) హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో 'సెక్షన్-8.. హైదరాబాద్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్రలను ఓడిద్దాం' పేరిట సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. 'సెక్షన్-8 అమలు చేసేందుకు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసుస్టేషన్లు పెడతామంటున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన తమిళ కూలీల ఎన్కౌంటర్పై తమిళనాడు పోలీసులు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించడం సమ్మతమేనా? ఇలాంటి ఆటలాడటం దేశానికి చాలా ప్రమాదకరం' అని జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకపోయినప్పటికీ వ్యక్తిగత చిక్కుల నుంచి బయటపడేందుకే సెక్షన్-8ని తెరపైకి తీసుకువచ్చారని..ఇది అనైతికమన్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ప్రజాప్రతినిధి కాదని.. విధులు, బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తారని చెప్పారు.

'ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు సెక్షన్-6ను రూపొందించింది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారంలా రాజధాని నిర్మాణం జరుగుతుంటే అక్కడి మేధావులు సెక్షన్-6 అమలు గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు' అని జస్టిస్ సుదర్శన్రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 జూన్ 2వ తేది నుంచి అమలులో ఉందని.. దీనిలో భాగంగానే సెక్షన్-8 కొనసాగుతోందని చెప్పారు. హైదరాబాద్లో ప్రజలు కలిసి మెలిసి నివసిస్తున్నారని.. లేనివి సృష్టించి పబ్బం గడుపుకోవడం రాజ్యాంగ సమ్మతం కాదన్నారు.
సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సెక్షన్-8పై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పుస్తకాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సదస్సులో టివివి నగర శాఖ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, జెఏసి కో-ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టివివి రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications