తమాషా కోసం కాదు: సంతోషంగా సిద్ధిపేటకు కేసీఆర్ వరాలు
హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు పాలనను మరింతగా చేరువ చేస్తూ, అభివృద్ధే లక్ష్యంగా 21 నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. దసరా రోజున సిద్దిపేట నుంచి కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన సందర్బంగా ఆయన రోడ్షోలో మాట్లాడారు.
'నేను మీరు పెంచిన బిడ్డను, మీ చేతుల మీదుగా పెరిగాను' అని అన్నారు. 'మీ దీవెనల వల్లే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొచ్చానని' తెలిపారు. తాను సిద్దిపేటలో తిరగని గ్రామంలేదని, తిరగని గల్లిలేదని వివరించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని తెలిపారు. మీరు తెలంగాణ కోసం పంపించారు. 'నేను తెలంగాణ సాధించుకొచ్చానని' తెలిపారు.
ఏదో తమాషా కోసం తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రూపాయి కూడా లబ్ధిదారునికి అందాలన్న ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రతీ జిల్లాలో కూడా 2 లక్షల నుంచి మొదలుకొని 4 లక్షల వరకు మాత్రమే జనాభా ఉండాలని ఆయన అన్నారు. ఈ విధంగా ఉండటం వల్ల ఆ జిల్లాల్లోని కుటుంబాల పరిస్థితులన్నీ సంబంధిత జిల్లా కలెక్టర్కు తెలిసే అవకాశముంటుందని తెలిపారు.
అనంతరం మర్కూక్ మండల సభలో మాట్లాడారు. రూ. 10 కోట్లతో మర్కూక్ మండలాన్ని బంగారు మండలంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు అవుతుందని కేసీఆర్ తెలిపారు.
సిద్దిపేట జిల్లాను ఏర్పాటులో భాగంగా తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం తాత్కాలిక కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు... కళాకారుల ఆట.. పాట నడుమ వైభవోపేతంగా జిల్లా ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సతీశ్, రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఫరూక్, సుధాకర్రెడ్డి, సలీం, జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జేసీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కొత్త జిల్లాల్లో కొత్త పాలనకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త కలెక్టర్లనూ నియమించింది.
ఇప్పటిదాకా జాయింట్ కలెక్టర్లు (జేసీలు)గా పనిచేస్తున్నవారితోపాటు జడ్పీ సీఈవోలుగా పనిచేస్తున్నావారినీ కలెక్టర్లుగా నియమించింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను (నాన్ ఐఏఎస్ కేడర్) జేసీలుగా నియామకం జరిపింది. తొమ్మిది జిల్లాలు నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, హబూబాబాద్, జనగామ, యాదాద్రి, మెదక్, వికారాబాద్, వనపర్తిలకు మహిళా కలెక్టర్లను నియమించారు.