మునుగోడు ఎవరిదో తెల్చేసిన కేఏ పాల్.. మెజార్టీ ఎంతో తెలుసా..?
మునుగోడు ఉప ఎన్నికలో తాను 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తాను ఇక్కడి ప్రజల గుండెల్లో ఉండిపోయానని అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు వివరించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థులు 27 మంది తనకు మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ జనతాపార్టీ ఓడిపోతుందని తెలిసి తన ప్రియశిష్యుడైన జేపీ నడ్డా మునుగోడు సభను రద్దుచేసుకున్నారని వివరించారు. తాను గెలిస్తే బీజేపీ గెలిచినట్లేనని, తన గెలుపునే వారి గెలుపుగా ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా తనకే మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడునెలల సమయంలో టీఆర్ఎస్ 11,200 కోట్లు ఖర్చు చేసినట్లు తనదగ్గర సమాచారం ఉందన్నారు. అంత ఖర్చుపెట్టే బదులు వాటిల్లో ఒక రూ.100 కోట్లు ఖర్చుపెడితే మునుగోడు అభివృద్ధి చెందేదికదా అని ప్రవ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితివారు తాను అద్దెకు తీసుకున్న గదిని కూడా దక్కకుండా చేస్తున్నారని, తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని, అయినా తాను తగ్గేదేలే అన్నారు.
మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కేఏ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒకరోజు రైతు వేషంలో, మరోరోజు మరో వేషంలో వస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మంచి డాన్స్ వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ డబ్బును వరదలా పారిస్తోందని, అంత డబ్బు ఆ పార్టీకి ఎక్కడిది? అనే విషయంలో తనదగ్గర పూర్తి సమాచారం ఉందని, త్వరలోనే దాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు.