అవినీతి కాంగ్రెస్ పేటెంట్: శ్రీహరి, ముడుపుల కోసమే వాటర్ గ్రిడ్: భట్టి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర కాంగ్రెస్నని ఆరోపించారు. జలయజ్ఞం పేరుతో అవినీతికి పాల్పడి ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని అన్నారు. వాటర్ గ్రిడ్ పథకం పనులు ప్రారంభం కాక ముందే అవినీతి ఎలా జరిగిందో భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ చేశారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తే అవగాహన లేకుండా మాట్లాడితేఎలా? అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో ఎక్కడా పొరపాట్లు జరగలేదన్నారు. అధికారం రాదని తెలిసే కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు ఛీకొట్టినా వారికి ఇంకా సోయి రాలేదని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ద్రోహీ చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తోన్న టీడీపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు చేస్తోన్న కుట్రలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
రాజీవ్ జ్యోతి సద్భావ యాత్రకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతురావు అన్నారు. కులం, మతం పేరుతో దేశాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. శుక్రవారం పెరంబదూర్ నుంచి వచ్చిన రాజీవ్ జ్యోతి సద్భావ యాత్రకు గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికి అనంతరం వీహెచ్ పైవ్యాఖ్యలు చేశారు.
మిషన్ కాకతీయ ద్వారా కోట్లాది రూపాలను దండుకుంటున్నారు: భట్టి
ముడుపుల కోసమే వాటర్ గ్రిడ్ పథకాన్ని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిందని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా తనయుడు కేటీఆర్, మిషన్ కాకతీయ పథకం ద్వారా అల్లుడు హరీష్ రావు కోట్లాది రూపాయలను దండుకున్నారని ఆరోపించారు.
తెలంగాణలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి సాగు, తాగు నీటి సమస్య తీర్చాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ పథకాన్ని సీఎం కేసీఆర్ రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్నారని, ఆ కుట్రలను తిప్పికొడతామని ఆయన అన్నారు.