కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా?: తేల్చి చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
2016, 2018లో సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి, హై పవర్ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
మరోవైపు, కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది. పలుమార్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వినతులు చేసింది. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని.. తెలంగాణలో కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, కేంద్రం మాత్రం సానుకూలంగా స్పందించలేదు.
'జాతీయ హోదా కావాలంటే సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరి. ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ ఆమోదం కూడా ఉండాలి. ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకోలేదు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి. హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉండేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు వివరించారు.