టీ సర్కార్ కు షాక్ ఇచ్చిన కాళేశ్వరం కరెంట్ బిల్లు..! తడిసి మోపెడయ్యిందంటున్న అదికారులు..!!
హైదరాబాద్ : కరెంటు ప్లగ్గులో వేలు పెడితే షాక్ తగలడం సహజం. కాని కరెంట్ బిల్లు చూడగానే షాక్ తగిలితే అదే విచిత్రం. తెలంగాణ ప్రభుత్వం పస్తుతం షాక్ లో ఉంది. టీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లకు సంబంధించి తొలి కరెంట్ బిల్లు వచ్చేసింది. ఒక నెల రోజులకే 12.64 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఇక మరో 8 కోట్ల రూపాయల వరకు పాత బకాయిలు ఉండడంతో ఈ బిల్లు తడిసి మోపెడయింది. ఒక్క కన్నెపల్లి పంప్హౌస్ కరెంటు బిల్లు 20.64 కోట్ల రూపాయలకు చేరింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా జూన్ 21న సీఎం చంద్రశేఖర్ రావు మేడిగడ్డ సమీపంలోని కన్నెపల్లి పంప్హౌస్లో మోటార్లను ఆన్ చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు 5.7 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజీకి పంపింగ్ చేశారు. భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావటంతో దీనికి సంబంధించిన కరెంటు బిల్లు ఎంత వచ్చిందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.
Recommended Video
ప్రతి నెలా 23వ తేదీన ట్రాన్స్కో ఇంజినీర్లు ఇక్కడ మీటర్ రీడింగ్ తీస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో కన్నెపల్లి పంప్హౌస్కు 1.96 కోట్ల యూనిట్ల విద్యుత్తు వాడినట్లు తాజా రీడింగ్లో తెలిసింది.తెలంగాణ ఈఆర్సీ నిర్దేశించిన మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు వాడుకునే కరెంట్కు ఒక్కో యూనిట్కు ఆరు రూపాయల చొప్పున బిల్లు లెక్కగట్టారు. 2018 డిసెంబర్లోనే కన్నెపల్లి పంప్హౌస్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు.
ఈ పంప్హౌస్లో ఉన్న ఒక్కో మోటార్ కెపాసిటీ 40 మెగావాట్లు. మోటార్ ఒక రోజంతా నడిపితే 2300 క్యూసెక్కుల నీటిని పంప్ చేసే వీలుంది. ప్రస్తుతం ఇక్కడ ఆరు పంప్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. మంగళవారం వరకు ఇక్కడి పంప్లు మొత్తం 859 గంటలు రన్ చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్లు పూర్తి స్థాయిలో వాడితే ఈ బిల్లు అయిదు రెట్లకు పెరుగుతుందని అదికారులు అంచనా వేస్తున్నారు.