దేశంలోనే ప్రథమస్థానం: పేర్వారం, 2018లో పూర్తికానున్న కాళోజీ కళాకేంద్రం
హైదరాబాద్: పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి పరిచి దేశంలోనే రాష్ట్ర పర్యాటకరంగాన్ని ప్రథమస్థానంలో నిలుపుతామని మాజీ డీజీపీ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్మించే ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాకేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు.
మంగళవారం హిమాయత్నగర్లోని తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి హంగులతో ఈ కళాకేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. మూడున్నర ఎకరాల్లో ఈ కళాకేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 2018లో కళా కేంద్రం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
బంగారు తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విశేష కృషిచేస్తున్నారని పేర్వారం రాములు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ క్రిస్టినా, ఈడీ సుమిత్సింగ్, పీఆర్వో పీ పురేందర్ పాల్గొన్నారు.