పదవి పోయిన వేళ..తెర వెనుక నేతపై కవిత నిప్పులు
భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనాయకత్వం ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ప్రతిష్ఠాత్మక పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నామినేట్ చేసింది.
ప్రతిష్ఠాత్మక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లోని బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవాధ్యక్షురాలిగా కవితను తొలగించింది పార్టీ. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ పరిణామంపై కవిత స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను పోరాడుతుంటే కొందరు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి నష్టం లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న సమయంలో తనను తొలగించడం వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు.
ఈ మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాల గురించి కవిత ప్రస్తావించారు. రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాను లేఖ రూపంలో తెలియజేశానని గుర్తు చేశారు.
కేసీఆర్కు గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశానని, అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్కు రాసిన ఆ లేఖను లీక్ చేశారని పునరుద్ఘాటించారు. ఆ లేఖను లీక్ చేసి తనపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని తాను కోరుతునున్నానని కవిత మరోసారి స్పష్టం చేశారు.
పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కక్షగట్టారని విమర్శించారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని అందరికీ తెలిసినవేనని, ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే తనపైనే కక్షగట్టారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కుట్రదారులే తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని, తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారని పేర్కొన్నారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా మీ వెన్నంటే ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తానని చెప్పారు.
తాను దేశంలో లేని సమయంలో, కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంకేతికంగా ఇది తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోందని అన్నారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల కాలం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ పదేళ్లకాలంలో ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా సేవలందించానని అన్నారు.












Click it and Unblock the Notifications