కాంగ్రెస్ దేశానికి పట్టిన శని!, టీడీపీ చచ్చిపోయింది: కేటీఆర్ నిప్పులు, టీఆర్ఎస్లోకి కంచర్ల సోదరులు
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఎప్పుడో చచ్చిపోయిందని, కాంగ్రెస్ నేతలు వాపును చూసి బలుపు అని అనుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. ఇటీవల టీడీపీని వీడిన కంచర్ల భూపాల్రెడ్డి తన సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు కార్యకర్తలతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం కారెక్కారు.
Recommended Video
టీఆర్ఎస్లోకి కంచర్ల సోదరులు
ఇటీవల మంత్రి జగదీశ్రెడ్డి.. భూపాల్రెడ్డి సోదరులను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు.. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఏం చేశారని మీ వైపు..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 55ఏళ్లలో ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీవైపు చూస్తారని ప్రశ్నించారు. తమ పార్టీలో జాగా లేకపోవడంతోనే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జానా, ఉత్తమ్కుమార్ రెడ్డిలు నల్గొండ జిల్లా ప్రజలకు ఏం చేశారని నిలదీశారు.
కాల్చి చంపిన చరిత్ర మీది కాదా?
నల్గొండ జిల్లాలో ప్రజల నడుములు విరుగుతుంటే జానారెడ్డి, ఉత్తమ్కుమార్ ఎప్పుడన్నా పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎన్నిసార్లొచ్చినా కాంగ్రెస్కు ఘోరపరాజయం ఎదురైందన్నారు. ఆంధ్రా, తెలంగాణను బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ప్రశ్నించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ది కాదా..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలుపు కాదు.. వాపే..
తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎవరో నలుగురు పార్టీలో చేరగానే తమవైపు చూస్తున్నారనుకోవడం వాపేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎంతోమంది తెలంగాణ పౌరుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఇవ్వకపోతే చీపుర్లు తిరిగేస్తారనే ఇచ్చారని అన్నారు.
ఏకైక శత్రువు..
టీఆర్ఎస్కు ఏకైక శత్రువు కాంగ్రెస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ పార్టీవైపే ఉన్నారన్నారు. కాంగ్రెస్ మరో మారు ప్రజల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నంచేస్తోందన్నారు. కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవిని ముఖ్యమంత్రి దుబ్బాక నర్సింహారెడ్డికి ఇవ్వనున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.
భూపాల్ రెడ్డికి ఇంఛార్జీ బాధ్యతలు..
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఢిల్లీకి తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తాగు, సాగునీరు అందుకొనే జిల్లా నల్గొండేనని తెలిపారు. చరిత్ర కల్గిన పార్టీలు తెలంగాణ అభివృద్ధిపై దృష్టిపెట్టలేదన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జీగా భూపాల్రెడ్డిని కేసీఆర్ ప్రకటించారన్నారు.