ఉద్యమ ద్రోహులకు అందలం: టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా కరీంనగర్ మాజీ మేయర్, 51వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు రవిందర్ సింగ్. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులకు అవకాశాలు ఇచ్చి.. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని లేఖలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ మాజీ మేయర్. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన రవిందర్ సింగ్కు నిరాశ ఎదురైంది. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న రవిందర్ సింగ్.. గురువారం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
మరోవైపు, టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత గట్టు రామచందర్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యాను అని లేఖలో గట్టు రామచందర్ రావు తెలిపారు. మీరు(కేసీఆర్) ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానని తెలిపారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు గట్టు రామచందర్ రావు .
Recommended Video
టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ నేతలు ఒకేసారి పార్టీకి రాజీనామా చేయడం కొంత నష్టం చేసే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీకి రాజీనామా చేసిన నేతలిద్దరి భవితవ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. త్వరలోనే మరో పార్టీలో చేరే విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.