కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు: అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య నిర్ణయం, వారికి షాక్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము జేడీ(ఎస్)కు మద్దతిస్తున్నామని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని చెప్పారు.
తాము కర్నాటకలో అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పారు. కానీ జేడీఎస్కు మద్దతిస్తున్నామన్నారు. సోమవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
రెండు జాతీయ పార్టీలు కర్ణాటకలో పూర్తిగా విఫలం అయ్యాయని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలన్నారు. మజ్లిస్ పార్టీ జేడీఎస్కు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటామన్నారు.
అవసరమైతే జేడీఎస్ తరపున బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయాలని భావిస్తోందని. ఈ మేరకు సీట్ల పంపిణీ కోసం అక్కడి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి. అసదుద్దీన్ జేడీఎస్కు మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు.