చంద్రబాబును లాగి రేవంత్ రెడ్డికి కర్నె సూటి ప్రశ్న, 'సచివాలయం కేసీఆరే కోసం కాదు'
హైదరాబాద్: రైతు పాదయాత్ర చేస్తున్న తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి పైన తెరాస నేత కర్నె ప్రభాకర్ సోమవారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీలో రాజధాని అమరావతి కోసం భూములు లాక్కుంటే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. సమైక్య ఏపీలో చంద్రబాబు తెలంగాణకు, రైతులకు చేసిందేం లేదన్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. తొమ్మిది ఏళ్ల పాలనలో టిడిపి చేసిందేం లేదన్నారు. చంద్రబాబు కాలకేయుడిలాంటి వాడని కర్నె అభివర్ణించారు. రేవంత్ రెడ్డి కూడా రాజకీయ ఉనికి కోసమే రైతు యాత్ర చేస్తున్నారన్నారు.
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పిస్తుంటే అడగడుగునా అడ్డుతగులుతున్నారన్నారు. కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేశారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
అందుకే చంద్రబాబును కాలకేయుడు అని చెప్పుకోవచ్చారు. చంద్రబాబు హయాంలో 15 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యకు కారణం టిడిపి కాదా? అని నిలదీశారు.
కరెంట్ ఛార్జీలను తగ్గించమంటే కాల్చి చంపిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ నేతలు పాదయాత్రల పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు ముక్కులునేలకు రాస్తూ పాద యాత్రలు చేస్తే తప్ప ప్రజలు సహించరన్నారు.
సచివాలయం కేసీఆర్ కోసమే కాదు: పల్లా
సచివాలయ నిర్మాణం పైన ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎంపీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. సచివాలయం కేసీఆర్ కోసమే కాదన్నారు. మరో వందేళ్లకు సరిపడా సీఎం అధికారిక నివాసం నిర్మిస్తున్నారన్నారు. ప్రస్తుత సచివాలయంలో పార్కింగ్ కూడా సరిగా లేదన్నారు.
ఎవరు అడ్డుపడ్డా సచివాలయం కట్టి తీరుతామని చెప్పారు. నిరంతరం తమ నాయకుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. వచ్చే ఏడాది అన్ని నియోజకవర్గాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
రైతు పాదయాత్ర చేస్తున్న తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి పైన తెరాస నేత కర్నె ప్రభాకర్ సోమవారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీలో రాజధాని అమరావతి కోసం భూములు లాక్కుంటే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. సమైక్య ఏపీలో చంద్రబాబు తెలంగాణకు, రైతులకు చేసిందేం లేదన్నారు.