రేవంత్రెడ్డి అమరావతికి పరిమితం!: కర్నె, ఆంధ్రజ్యోతిపై మంత్రి ఆగ్రహం
హైదరాబాద్: మచ్చలేని ప్రజా నాయకుడిగా ఉన్న మంత్రి లక్ష్మా రెడ్డి పైన ఆరోపణలు చేశాడంటే ఎవరిపైనైనా ఆరోపణలు చేయగలడని, అతని నేరపూరిత చరిత్ర తెలంగాణ సమాజానికి తెలుసునని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శనివారం అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిపోయి కేసుల్లో ఇరుక్కుని కొడంగల్ నియోజకవర్గానికి ఎందుకు పరిమితమయ్యాడో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
తెలంగాణ గడ్డకు ద్రోహం చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భజన చేస్తున్నందుకు చివరికి అతని బతుకు విజయవాడకో, అమరావతికో పరిమితమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేకుండా చేసుకుంటున్నావన్నారు.

నీ తప్పుడు విధానాలు మానుకోకపోతే ప్రజలే నీకు గుణపాఠం చెబుతారన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషితో కొడంగల్ నియోజకవర్గంలో కూడా టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందన్న అక్కసుతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
కాగా, తెలంగాణపై విషం కక్కుతున్న ఆంధ్రజ్యోతి పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాలను, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
నేను వైద్య కోర్సు చేయనట్లుగా, నావద్ద వైద్య డిగ్రీ లేనట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానన్నారు. దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాయడం మంచిదికాదని, తనపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేసిన రేవంత్పై, తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై న్యాయపరమైన చర్యలు చేపడుతామన్నారు.












Click it and Unblock the Notifications