బెజవాడలో బాబు ఇంటి ముందు: తెలంగాణ టిడిపి నేతలకు కర్నె
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న టిడిపి ఒక్కనాడూ రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని, ఇఫ్పుడదే రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తోందని టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శనివారం విమర్శించారు.
అధికారంలో ఉన్నపుడు వ్యవసాయం దండుగ అనడమే కాకుండా ఆ రంగానికి సమాధి కట్టాలని ప్రయత్నించింది చంద్రబాబు కాదా? అని తెలంగాణ టీడీపీ నేతలను ప్రశ్నించారు. రైతులంటేనే చంద్రబాబు అసహ్యించుకుంటారన్నారు.
రైతుల అంశాన్ని రాజకీయం చేస్తూ విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లడం పనిగా పెట్టుకున్నాయన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలన సాగించిన పందొమ్మిదేళ్లలో దాదాపు 26వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దాదాపు 10 నుంచి 12వేల మంది రైతులు తొమ్మిదేళ్ల టీడీపీ ముష్కర పాలనలోనే నేలకొరిగారన్నారు.
గతంలో ఎన్నో దురాగతాలకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో రైతుల ఆత్మహత్యల పరంపర ఇక్కడి టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అన్నారు. రైతులకు చేసిన ద్రోహానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు పదివేల సార్లు ఆత్మహత్యలు చేసుకోవాలన్నారు.
రైతుల శవాలను సీఎం కార్యాలయం దగ్గర పడేస్తామంటున్న టీడీపీ నాయకులు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చనిపోయిన రైతుల శవాల్ని చంద్రబాబు ఇంటి ముందుగానీ, విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గానీ ఉంచి నిరసన తెలపాలన్నారు.