కార్తీకమాసంలో జ్యోతిర్లింగ దర్శనం ఇలా అతి సులభం- సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్
IRCTC: పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు బారులు తీరి నిల్చున్నారు. భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తోన్నారు.
ఏకాదశి, సోమ, శనివారాల్లో ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున, సాయంత్ర వేళల్లో ఆలయాల్లో దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. తులసికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోవులను పూజిస్తారు. ఈ మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి.

పవిత్ర కార్తీక మాసంలో నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజుకొకటి చొప్పున కార్తీక పురాణంలో ఉండే 30 అధ్యాయాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శైవక్షేత్రాల్లో కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తారు.
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో వెలిసిన జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి ఉద్దేశించిన ప్యాకేజీ ఇది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా జ్యోతిర్లింగ ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు.
ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఈ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్లనుంది. తమిళనాడులో వెలిసిన ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రాలైన తిరువణ్ణామలై అరుణాచలం, రామేశ్వరంతో పాటు మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు బృహదీశ్వర ఆలయాలను సందర్శించవచ్చు.

వీటితో పాటు కేరళలోని తిరువనంతపురంలో వెలిసిన శ్రీ అనంతపద్మనాభస్వామివారి ఆలయాన్ని కూడా ఈ ప్యాకేజీలో చేర్చారు. మొత్తం ఈ టూర్ ప్యాకేజీ 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. దీనికి ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,250 రూపాయలు. భారత్ గౌరవ్ యాత్ర దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర స్పెషల్ పేరుతో ఈ రైలు బయలుదేరుతుంది.
దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు జోన్ల వారీగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను మరింత విస్తృతపరిచారు. వాటి ట్రిప్ల సంఖ్యనూ పెంచుతోన్నారు. మున్ముందు విజయవాడ/విశాఖపట్నం నుంచీ ఆయా పుణ్యక్షేత్రాలకు ఈ రైల్ కనెక్టివిటీని కల్పించే దిశగా చర్యలు తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications