కాశ్మీరీ మహిళను మింగిన హైదరాబాద్ సంతానసాఫల్య కేంద్రం
హైదరాబాద్: పిల్లలు పుట్టేందుకు చికిత్స కోసం హైదరాబాదు నగరానికి వచ్చిన జమ్మూ కాశ్మీర్ యువతి మృత్యువాత పడింది. ఈ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మూ-కాశ్మీర్ శ్రీనగర్ నివాసి ఇమ్తిహాస్ అహ్మద్కు తహసినా ఫర్వీన్(35)తో కొద్దికాలం క్రితం వివాహం జరిగింది. పిల్లలు పుట్టకపోవడంతో ఫెర్టిలిటీ చికిత్స కో సం నగరానికి రెండు నెలల క్రితం వచ్చారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 4లో గల డాక్టర్ రోయారోజతిని కలిశారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) చికిత్స చేయాలని ఆమె సూచించారు. ఈ నెల 1వ తేదీన చికిత్స చేస్తుండగా ఆమె అనారోగ్యానికి గురైంది. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా 2వ తేదీన మృతి చెందింది. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వల్లనే ఫర్వీన్ మరణించినట్టు వైద్యులు చెప్పారు.
వైద్యురాలు రోయారోజతి నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. సరైన పరీక్షలు నిర్వహించకుండానే చికిత్స చేశారని, అందువల్లనే ఆమె మరణించిందని ఆరోపించారు. ఇమ్తిహాస్ ఫిర్యాదు మేరకు బం జారాహిల్స్ పోలీసులు వైద్యురాలిపై కేసు నమోదు చేశారు.
రోయారోజతి అందించిన వైద్య చికిత్సల రిపోర్టును డీఎం అండ్ హెచ్ఓకు పంపించామని ఎస్ఐ దయాకర్రెడ్డి చెప్పారు. వారిచ్చే నివేదిక అనంతరం త దుపరి చర్యలు తీసుకుంటామన్నారు.