కేసీఆర్ పిలిస్తే వెళ్తా.. వాళ్లకు కవిత షాక్!
పాలిటిక్స్ పక్కా చేస్తా, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అయితే రాజకీయాలు చేయడానికి ఇంకా సమయం ఉందని ఇప్పుడు ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వరంగల్లో జనంబాట పాదయాత్రలో పాల్గొంటున్న కవిత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు జరిగే చివరి సంవత్సరం మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధిపైన దృష్టి సారించాలన్నారు.
కేసీఆర్ పిలిస్తే వెళ్తా: కవిత
పాలకపక్షం, ప్రతిపక్షం పనిచేయడం లేదని, అందుకే ప్రభుత్వాన్ని అడిగే బాధ్యత జాగృతి తీసుకుందన్నారు. కెసిఆర్ తన తండ్రి అని పిలిస్తే తప్పకుండా వెళతానని, రాజకీయంగా వెళ్లే పరిస్థితి మాత్రం లేదని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్ కే కట్టడి చేశారని, ఒక టీచర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న పరిస్థితి లేదని, ఇంకా అవినీతి ఎక్కడ చేస్తానంటూ ప్రశ్నించారు.

అసమానతలు లేని తెలంగాణా లక్ష్యం
అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్న కవిత విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోయే పరిస్థితి ఉండాలన్నారు. మహిళలు, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని, స్టూడెంట్ యూనియన్ లో ఎన్నికలు మళ్ళీ మొదలు పెట్టాలని అప్పుడే కొత్త నాయకత్వం వస్తుందన్నారు.
హరీష్ రావును టార్గెట్ చేసిన కవిత
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన మాట్లాడిన కవిత వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని 1100కోట్ల రూపాయల నుండి 1700కోట్లకు పెంచారని, హరీష్ రావు బినామీ కంపెనీకి దాన్ని అప్పగించారని దీనిపై విజిలెన్స్ విచారణ చేయాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనలో ప్రశ్నించే తత్వం మారలేదు అన్నారు. బీసీల విషయంలో తన కమిట్మెంట్ కొనసాగుతుందని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు మొదటి అడుగు మాత్రమేనని కవిత అన్నారు.
ఆకలైనా తట్టుకుంటాను, కానీ అవమానం తట్టుకోలేను
20 సంవత్సరాలు బీఆర్ఎస్ లో పని చేస్తే తనను అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు పంపించారని, ఆకలైన తట్టుకుంటాను అవమానాన్ని తట్టుకోలేను అన్నారు. పొలిటికల్ గా బీఆర్ఎస్ తో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయంగా పార్టీ మార్చాల్సిన అవసరం ఉంటే మారుస్తా
ఏ సమస్యలపైన విమర్శలు చేసి అధికారంలోకి వచ్చారో ఆ సమస్యలన్నీ అలానే పెండింగ్లో ఉంచారు అన్నారు. వరంగల్ జిల్లాలో మహిళా మంత్రులు ఇద్దరు ఉండి అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. నిరుద్యోగుల సమస్యలు తీరలేదు అన్నారు. అన్ని జిల్లాలలోని సమస్యల పైన జాగృతి పోరాటం సాగుతుందని కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా పార్టీని మార్చాలి అనుకున్న రోజు తప్పకుండా మారుస్తానని కవిత స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications