అత్తారింట్లో బతుకమ్మ ఆడిన ఎంపి కవిత
నిజామాబాద్: పార్లమెంటుసభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన అత్తారింట్లో బతుకమ్మ ఆడి సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న తన అత్తగారింట్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
సోమవారం ఉదయం 11గంటల నుంచి కవిత తన అత్తయ్య, ఆడపడుచులు, మేనకోడలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి ఆడిపాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెట్టినింట్లో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు ఆడపడుచులకు ప్రత్యేకమని చెప్పారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ నగర మేయర్ సుజాత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తదితరులు ఉన్నారు.
బతుకమ్మ వేడుకలను పురస్కరింకుని ఎంపి కవిత.. తెలంగాణలోని పది జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో ఒక్కో రోజు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు.