చంద్రబాబుపై కేసు ఆలోచిస్తున్నాం: ఎంపీ కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో మీ పార్టీ నడవదని, మూసేయాలని ఆమె ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు. చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నారన్నారు.
అందుకు ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి అరెస్టు కావడమే నిదర్శనమన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇరికించారని తెలంగాణ టీడీపీ నేతలు చెప్పడం సరికాదన్నారు. ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్న అంశంపై చట్టపరంగా ఆలోచిస్తామన్నారు.
ఆంధ్రాబాబు గుట్టు రట్టు: జూపల్లి
ఆంధ్రాబాబు గుట్టు రట్టయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారని చెప్పారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు పరువు తీశారని ధ్వజమెత్తారు.
వీడియోలు ఎవరిచ్చారో తెలియదు: ఏసీబీ డీజీ ఏకే ఖాన్
తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వీడియోలు అన్ని చానళ్లలో ప్రసారం అయ్యాయి. దీనిపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ స్పందించారు. టీవీ ఛానళ్లకు వీడియో ఫుటేజీ ఎలా వెళ్లిందో తనకు తెలియదన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు.