స్మశానాలను వదిలిపెట్టని పోలీసులు.. ఏం చేశారంటే!
పోలీసులు ప్రజలలో మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని అవగాహన కల్పించడం కోసం చేయని ప్రయత్నాలు ఏవీ లేవు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తూ, జరిమానాలు విధిస్తూ, జైలుకు పంపినా కూడా చాలామంది మారటం లేదు. మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల సేవనం, అతివేగం వంటి వాటితో యువత ప్రాణాలను కోల్పోతున్నారు.
యువతలో మార్పు కోసం వరంగల్ పోలీసుల వినూత్న ప్రయోగం
నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలా సందర్భం ఏదైనా సరే మద్యం సేవించి విపరీతమైన వేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాల బారినపడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువతలో మార్పు కోసం వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ పై యువతకు పోలీసుల అవగాహన
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న యువతను దృష్టిలో పెట్టుకొని, వారి స్నేహితులకు బంధువులకు అవగాహన కల్పించడానికి అంత్యక్రియలను వేదికగా చేసుకుంటున్నారు. మద్యం మత్తులో, నిర్లక్ష్యంతో యువకులు తమ ప్రాణాలను ఏ విధంగా పోగొట్టుకుంటున్నారో వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు.
మద్యం సేవించి డివైడర్ ను డీకొని మరణించిన ఇద్దరు యువకులు
ఇటీవల కమలాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న నవీన్ కుమార్, నాగరాజు అనే యువకులు బైక్ పై అతివేగంతో డివైడర్ను ఢీకొట్టి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శనిగరం గ్రామంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది.ఇక ప్రమాద సంఘటన తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్మశానంలో యువతకు కౌన్సిలింగ్
ఈ విచారణలో యువకుల యొక్క అతివేగం నిర్లక్ష్యం, మద్యం సేవించి ఉండడం కారణమని పోలీసులు నిర్ధారించారు. మద్యం మహమ్మారి వల్లే ఇద్దరి నిండు ప్రాణాలు పోయాయని గుర్తించిన పోలీసులు, మరణించిన వారి స్నేహితులు, గ్రామంలోని యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. మరణించిన వారి అంత్యక్రియలకు హాజరై స్మశానానికి చేరుకున్న పోలీసులు, అక్కడ తమ స్నేహితుల కోసం విలపిస్తున్న మిత్రులకు, స్థానిక యువతకు మరణించిన యువకులు ప్రాణాలు కోల్పోయిన తీరును వివరించి చెప్పారు.
మరణించిన స్నేహితులను చూసి, పోలీసుల మాటలు విన్న యువకులు
కొడుకులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులతో కూడా నేరుగా మాట్లాడించి ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్ళ ఎదురుగా నిర్జీవంగా పడి ఉన్న స్నేహితులను చూసి, పోలీసులు చెప్పిన మాటలు విన్నారు యువకులు.
స్మశానం వేదికగా పోలీసులు చేసిన ప్రయత్నంపై చర్చ
తమకోసం, తమ వారి సంతోషం కోసమైనా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించకూడదు అనే విషయాన్ని గుర్తిస్తారని పోలీసులు స్మశానం వేదికగా చేసిన ఈ ప్రయత్నం పైన హన్మకొండ జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పోలీసులు చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications