గులాబీ బాస్కు పసుపు ఫీవర్? కూతురు కోసం రంగంలోకి కేసీఆర్?
కారు - సారు - పదహారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. 16 సీట్లు తమవేనని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే నిజామాబాద్లో నెలకొన్న పరిణామాలు గులాబీ బాస్కు నిద్ర కరువు చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సుపు రైతులు.. మరోవైపు ప్రత్యర్థులు కారు జోరుకు స్పీడ్ బ్రేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలో కూతురు గెలుపు కోసం స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కవిత విజయంపై ధీమా
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహం, రాష్ట్రంలో గులాబీ పార్టీకి ఉన్న ప్రజాదరణ టీఆర్ఎస్కు కొండంత బలం ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్లో కవిత విజయం నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడ సీన్ రివర్సైంది. రైతుల తిరుగుబాటు టీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరానికి గురిచేసింది.

నిజామాబాద్ బరిలో 178 రైతులు
నిజామాబాద్లో పసుపు, ఎర్రజొన్న పంట ఎక్కువగా పండుతుంది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిథిలో పసుపు పండించే రైతులు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తమ పంటకు గిట్టుబాటు ధర కోసం ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినా.. దాన్ని నిలబెట్టుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో హామీలు నెరవేర్చని నాయకులకు బుద్ధి చెప్పడంతో పాటు తమ సమస్యను జాతీయస్థాయిలో చర్చకు తీసురావాలన్న ఉద్దేశంతో ఎన్నికల బరిలో దిగారు. మొత్తం 178 మంది రైతులు పోటీకి సిద్ధమయ్యారు. ఇంత భారీ సంఖ్యలో రైతులు నిజామాబాద్ బరిలో నిలవడంతో టీఆర్ఎస్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం ఆందోళన చెందుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పుంజుకుంటున్న ప్రత్యర్థులు
రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతకు తోడు ప్రత్యర్థి పార్టీల్లో నాయకులు బలం పుంజుకుంటుండటం కవిత విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఒకవైపు కాంగ్రెస్ నేత మధుయాష్కి మరోవైపు బీజేపీ అభ్యర్థి అరవింద్ తమ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొడుకు అరవింద్ గెలుపు కోసం డి. శ్రీనివాస్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలలో డీఎస్కు కొంత పట్టుంది. ఇది కవితకు ప్రతికూలంగా మారే అవకాశముంది.

రంగంలోకి దిగిన గులాబీ బాస్
నిజామాబాద్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కూతురు కవిత గెలుపు కోసం సీఎం తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ స్వయంగా మాజీ మంత్రి మండల వెంకటేశ్వరరావు ఇంటికెళ్లి గంటన్నర పాటు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మండవను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆయన సామాజికవర్గ ఓట్లు కవితకు పడతాయని గులాబీ బాస్ భావిస్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్పై లక్ష్మణ్ ఫైర్
సీఎం కేసీఆర్.. మండవ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. నిజామాబాద్లో తన కూతురు కవిత ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలనను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications