కెసిఆర్, చంద్రబాబు మధ్య వైరం ముగిసినట్లేనా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మధ్య వైరం ముగిసినట్లేనని భావిస్తున్నారు. ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు కెసిఆర్ను ఆహ్వానించడంతో ఇరువురి మధ్య విభేదాలు సమసిపోయినట్లు భావిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్వయంగా కెసిఆర్ను ఆహ్వానించడాన్ని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కూడా హర్షించారు.
పలు సందర్భాల్లో కెసిఆర్, చంద్రబాబు పర్సపరం మాటల ఈటెలు దూసుకున్నారు. నోటుకు ఓటు కేసు విషయంలో కెసిఆర్ చంద్రబాబుపై, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు కేసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటు తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు ఎపి మంత్రులపైనే కాకుండా చంద్రబాబుపై కూడా విరుచుకుపడ్డారు.
Photos : కెసిఆర్ ని కలిసిన చంద్రబాబు
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంతో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఇరువురు కూడా అన్ని స్థాయిల్లో రాజీకి వచ్చారా అనే సందేహం కూడా కలుగుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్పై దూకుడు తగ్గించినట్లు కనిపిస్తున్నారు. అయితే, ఇది ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కారణంగానే జరిగిందని చెప్పడానికి తగిన ఆధారాలేవీ లేవు.
ఇటు, కెటి రామారావు వంటి తెలంగాణ మంత్రులు తమ కార్యక్రమాల్లో కాంగ్రెసు పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు తప్ప తెలుగుదేశం పార్టీని పెద్దగా విమర్శించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా భావిస్తోంది. ఇందుకు కేంద్రంలో మంత్రిగా ఉన్న ఎం. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ వంటివారు కూడా చొరవ ప్రదర్శించారని అంటున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చే స్థితి లేదని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా కెసిఆర్పై వ్యాఖ్యలు చేయడం వల్ల మరింతగా వైరం పెరుగుతుందనే భావనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు సాధ్యమైనంత త్వరగా ఎపి రాజధానిని హైదరాబాదు నుంచి అమరావతికి మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కెసిఆర్కు ఊరటనిస్తున్నట్లు చెబుతున్నారు. పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో కొనసాగితే తనకు అంత మంచిది కాదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద, ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడం ఇరు రాష్ట్రాలకు కూడా మంచిదనే భావనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తున్నారు.