కేసీఆర్-కేజ్రీవాల్ జాయింట్ స్టేట్మెంట్: మోదీకి అల్టిమేటం..!!
హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్- ఇవ్వాళ హైదరాబాద్లో ప్రత్యక్షం అయ్యారు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను కలుసుకుంటోన్నారు. వారి నుంచి మద్దతును కోరుకుంటోన్నారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకుని వస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాదలిచిన ఆర్డినెన్స్ను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలనేది ఆయన వాదన.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను మరింత కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా.. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే అధికారాలను మరింత కోత పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. పార్లమెంట్లో ఆర్డినెన్స్ను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను కలుస్తోన్నారు.

ఇందులో భాగంగా కేజ్రీవాల్.. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వంటి నాయకులను కలిశారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్కు వచ్చారు. భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్నారు. ఆయనతో భేటీ అయ్యారు.
అనంతరం కేసీఆర్-కేజ్రీవాల్ ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాఖ్య హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే ఈ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో దేశం చవి చూసిన ఎమర్జెన్సీ కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వాలను నియంత్రించే సాహసానికి ప్రధాని మోదీ పూనుకున్నారని, ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఖండించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అరాచకాలు మితిమీరాయని, బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఉద్దేశపూరకంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు మూడుసార్లు పట్టం కట్టారని, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలిచినప్పటికీ- మేయర్ ప్రమాణ స్వీకారాన్ని కేంద్రం అడ్డుకుందంటూ ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే గానీ- సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీ.. మేయర్ను ఎన్నుకోలేకపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి- ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉందంటూ మండిపడ్డారు.

లెఫ్టినెంట్ గవర్నర్ను అడ్డుపెట్టుకొని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ- దాన్ని ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, పార్లమెంట్లో దీన్ని తాము వ్యతిరేకిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. గవర్నర్ల వ్యవస్థను సైతం కేంద్రం రాజకీయమయం చేసిందంటూ ఆరోపించారు.
కేంద్రం తీరు వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఎలాంటి నిర్ణయాలను కూడా తీసుకోలేకపోతున్నానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కనీసం శాఖల కార్యదర్శులను సైతం బదిలీ చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రధాని మోదీ ఆర్డినెన్స్ను తీసుకొచ్చారని, ఇది ఢిల్లీ ప్రజలను కించపర్చినట్లేనని చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వం కావడం వల్లే రాజకీయంగా కక్షసాధిస్తోందని అన్నారు.
ప్రస్తుతం ఈ తరహా నియంతృత్వ ధోరణి ఢిల్లీకే పరిమితమైందని, క్రమంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు పాలించే రాష్ట్రాల సర్వ హక్కులను హరించడం ఖాయమని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేయడానికి కేసీఆర్, ఆయన పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కేసీఆర్ మద్దతు తమకు అవసరమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications