బాబు మోహన్, కొండా సురేఖలకు అందుకే షాక్: 105 మందిలో ఓడినవారూ
హుస్నాబాద్/హైదరాబాద్: అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 119 నియోజకవర్గాలకు గాను 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. శుక్రవారం మధ్యాహ్నం హుస్నాబాద్లో జరగనున్న బహిరంగ సభకు ఈ 105 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
Recommended Video
బాబు మోహన్కు షాక్, నో టిక్కెట్, కొండా సురేఖకు డౌట్: దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్
కేసీఆర్ సహా 13 మంది మంత్రులు, స్పీకర్ మధుసూదనా చారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలకు టిక్కెట్లు లభించాయి. తొలి జాబితాలో తాజా మాజీలు నల్లాల ఓదేలు స్థానంలో బాల్క సుమన్, బాబూ మోహన్ స్థానంలో క్రాంతి కిరణ్లను అభ్యర్థులుగా ప్రకటించారు. వరంగల్ ఈస్ట్ (కొండా సురేఖ), బొడిగె శోభ (చొప్పదండి), కనకారెడ్డి (మల్కాజిగిరి), సంజీవరావు (వికారాబాద్), సుధీర్ రెడ్డి (మేడ్చల్) స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వలేదు. ఇక్కడ చర్చించాల్సి ఉందని చెప్పారు.
ఈ చోట్ల ఖరారు చేయలేదు
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. అందరూ హైదరాబాద్లోనే గెలిచారు. ఈ ఐదు స్థానాల్లో నాలుగింట కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు. కేవలం ఉప్పల్లో మాత్రమే గతంలో బీజేపీ నేత చేతిలో ఓడిపోయిన సుభాష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. అంబర్ పేట, ఖైరాతాబాద్, ముషీరాబాద్, గోషామహల్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, గీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్ నగర్, కోదాడ, జరీబాద్ స్థానాలకు కూడా ఖరారు చేయలేదు. మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న చార్మినార్, మలక్పేట నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
మాజీలకు, ఓడిన వారికి టిక్కెట్లు
అత్యధిక స్థానాలను తాజా మాజీ ఎమ్మెల్యేలకే కేటాయించారు. తెరాసకు (2014లో ఇతర పార్టీల నుంచి గెలిచి తెరాసలో చేరిన వారు కూడా) 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఏడుగురు మినహా అందరికీ అంటే 83 మందికి టిక్కెట్లు కేటాయించారు. జానారెడ్డిపై నోముల నర్సింహయ్య పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఓడిన పిడమర్తి రవి, నోముల నర్సింహయ్య, సుభాష్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, సంజయ్ కుమార్, రామ్మోహన్ గౌడ్, సీతారాం రెడ్డి, జీవన్ సింగ్, ఆనంద్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలకు మళ్లీ టిక్కెట్లు ఇచ్చారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు
ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర రావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కనకయ్య, పువ్వాడ అజయ్, మదన్ లాల్, చల్లా ధర్మారెడ్డి, భాస్కరరావు, రవీంద్ర కుమార్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, వివేకానంద, మాధవరం కృష్ణారావు, విఠల్ రెడ్డి, మాగంటి గోపినాథ్లకు టిక్కెట్లు కేటాయించారు.
కొండా సురేఖ స్థానంలో గుండు సుధారాణికి ఛాన్స్
వరంగల్ తూర్పుకు ప్రస్తుతం కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె స్థానంలో గుండు సుధారాణికి అవకాశమిస్తారని తెలుస్తోంది. లేదా బస్వరాజ్ సారయ్యకు టిక్కెట్ లభిస్తుందని అంటున్నారు. మల్కాజిగిరిలో ప్రత్యామ్నాయంగా మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్లో కేఎల్ఆర్ ఉన్నారని చెబుతున్నారు.
ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు?
ఇప్పటి వరకు ఇచ్చిన టిక్కెట్ల పరంగా చూస్తే ఓసీలకు 55, బీసీలకు 21, ఎస్సీలకు 16, ఎస్టీలకు 11, మైనార్టీలకు 2 ఇచ్చారు. తొలి జాబితాలో మొత్తం నలుగురు మహిళలు ఉన్నారు. తెరాస తరఫున బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్లు తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గతంలో ఖమ్మం లోకసభకు పోటీ చేసి ఓడిన వెంకట్రావు భద్రాచలం నుంచి పోటీ చేస్తున్నారు.
బాబూ మోహన్కు అందుకే నో, కొండా సురేఖకు అందుకే
బాబు మోహన్, నల్లాల ఓదేలులకు వారి వ్యవహార శైలి, స్థానికంగా వ్యతిరేకత వల్ల టిక్కెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. సర్వేలలో వీరికి అతి తక్కువ ఓట్లు వచ్చాయి. వీరిద్దరిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పెండింగులో ఉన్న కొండా సురేఖ సహా మరో ఐదుగురికి టిక్కెట్లు అనుమానమే అంటున్నారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంతో ఇవ్వలేదని అంటున్నారు.