ఢిల్లీ హోటళ్లో పత్తాలాట, పీకే సర్వేతో కేసీఆర్కు షాక్, అరెస్ట్ పెద్ద విషయం కాదు: బీజేపీ నేతలు
హైదరాబాద్: దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరిన తెలంగాణ సీఎం కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టడంపై మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మాట్లాడారు.
కేసీఆర్ అరెస్ట్ పెద్ద విషయం కాదు, ఢిల్లీ హోటళ్లలో పత్తాలాట: అరవింద్
సీఎం కేసీఆర్ను లోపలేయడం బీజేపీకి పెద్ద పనేం కాదన్నారు ఎంపీ అరవింద్. 16 ఎంపీ సీట్లతో ఆయన దేశ్ కీ నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ బాప్ అయితే.. అసదుద్దీన్ బాప్ బండి సంజయ్ అని వ్యాఖ్యానించారు. ధర్నా పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ అశోకా హోటల్లో పత్తాలాడుతున్నారని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి కేసీఆర్ ధాన్యం బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీతోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్.
పాక్, శ్రీలంక కన్నా తెలంగాణ అప్పులే ఎక్కువ: మాజీ ఎంపీ వివేక్
ఇందిరా పార్క్ వద్ద ఈ నిరసనలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరంటూ విమర్శించారు. కేసీఆర్కు కమీషన్ల మీద ఉన్న ధ్యాస.. ప్రజల మీద లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. పాకిస్థాన్, శ్రీలంక దేశాల అప్పుల కంటే తెలంగాణ అప్పులే ఎక్కువని వివేక్ తెలిపారు.
పీకే సర్వేతో కేసీఆర్కు షాక్... అందుకే వరి డ్రామాలు
దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు వివేక్. మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో కేసీఆర్లో వణుకు మొదలైందని, అందుకే పీకేను పిలిపించుకొని సర్వే చేయించుకున్నారన్నారు. పీకే సర్వే ఫలితాలు తెలుసుకున్న కేసీఆర్.. షాక్కు గరయ్యారన్నారు.
టీఆర్ఎస్కు 3 ఎంపీ సీట్లు, 22కు మించుకుండా అసెంబ్లీ సీట్లు వస్తాయని పీకే సర్వేలో తేలిందన్నారు. అందుకే కేసీఆర్ వరి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఏనాడు ప్రతిపక్షాలకు అపాయిట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. మోడీ తనకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని చెబుతుంటే నవ్వొస్తుందన్నారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపలేరని వివేక్ స్పష్టం చేశారు.
కేసీఆర్ అంటే.. కల్వకుంట్ల కరప్షన్ రావు, కమీషన్ రావు: మురళీధరన్
సీఎం కేసీఆర్.. ఎవరి కోసం ఢిల్లీ తెలంగాణ భవన్లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్రమంత్రి మురళీధరన్. బీజేపీ నిరసనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొని కేంద్రానికి ఇవ్వాలన్నారు. కేసీఆర్ వడ్లు కొనేందుకు వెనకాడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చే డబ్బులన్నీ కేంద్రానివేనన్నారు. మోడీతో కొట్లాడటానికి, రాష్ట్రాలు తిరగడానికి డబ్బులుంటాయి కానీ... వడ్లు కొనడానికి లేవా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కొత్త డ్రామాలాడుతున్నారన్నారు. కేసీఆర్కు పాకిస్థాన్పై ఉన్న నమ్మకం దేశప్రజలపై లేదన్నారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షన్ రావు, కమీషన్ రావు అని అన్నారు. కమీషన్ రావు దేశాన్ని మోసం చేస్తున్నారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు.