ఏపీపై కేసీఆర్ గురి - కొత్త పొత్తులతో : ఓట్ల చీలిక - నష్టం ఎవరికి..!!
ఏపీలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు. ఏపీలో కేసీఆర్ తో కలిసి వచ్చే పార్టీలు ఏవి. ఎవరితో కలవబోతున్నారు. జాతీయ పార్టీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రయోగం చేసేందుకు సిద్దం అవుతున్నారు. అందునా కర్ణాటక - మహారాష్ట్ర లో కేసీఆర్ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటకలో కుమారస్వామి తో కలిసి పొత్తుతో ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ సిద్దమయ్యారు. మహారాష్ట్రలో రైతు సమస్యల ప్రధాన అస్త్రంగా వారి మద్దతు కూడగట్టు కొనే విధంగా అడుగులు వేస్తున్నారు.
ఏపీలో కేసీఆర్ స్కెచ్ రెడీ
ఏపీలో కేసీఆర్ ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో సంక్రాంతి వేళ..వచ్చే జనవరిలో పర్యటనకు కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త పొత్తుల లెక్కలు తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. అదే సమయంలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు కీలక అంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం ఏపీ ప్రజలు డిమాండ్ చేసినా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏపీకి వచ్చిన సమయంలో ఆదరించారు. కేసీఆర్ జన్మదినం - ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు సమయంలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఏపీకి చెందిన కొందరు మేధావులు - ప్రముఖలతోనూ జాతీయ పార్టీ ఏర్పాటుపైన కేసీఆర్ చర్చలు చేసారు.
ఆప్ - బీఆర్ఎస్ పొత్తు ఖాయమంటూ
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు జగన్ ఏనాడు జోక్యం చేసుకోలేదు. తన పార్టీని తెలంగాణలో మూసివేసారు. తన సోదరి షర్మిల తెలంగాణ కేంద్రంగా రాజకీయ పార్టీ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో రాజకీయంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ పైన అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తున్నా..దాదాపుగా ఆయన తెలంగాణ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే ఓట్లు - సీట్ల లెక్క కీలకం. దీంతో.. ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా కేసీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దం అవుతున్నారు. ఢిల్లీ - పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ తో కలిసి ఆయన ఏపీలో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతారని పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలోనూ ఈ సారి ఆప్ తో పొత్తు అంశాన్ని కొట్టి పారేయలేమని చెబుతున్నారు. మునుగోడులో వామపక్షాల మద్దతు కూడగట్టిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసారు.
ఏపీలో నిలబడేనా - ఎవరి ఓట్లకు గండి
అందులో భాగంగా..బీఆర్ఎస్ కోసం కలిసొచ్చే పార్టీలతో పొత్తులు తప్పవని చెబుతున్నారు. ఆప్ పైన మధ్యతరగతి- విద్యావంతులకు సానుకూలత ఉందనే అభిప్రాయం ఉంది. ఏపీలో జగన్ - చంద్రబాబును వ్యతిరేకించే వారికి మూడో ప్రత్యామ్నాయం లేదని.. ఆప్ తో పాత్తు ద్వారా ఏపీలో ప్రవేశిస్తే మంచి ఫలితం ఉంటుందనే అంచనాలు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాలతో పాటుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు - విద్యావంతుల మద్దతు ఏపీలో సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇధే జరిగితే ఏపీలో ఎవరి ఓట్లకు ఈ కొత్త పొత్తు ఏపీలో గండి కొడుతుందనే చర్చ మొదలైంది. ఈ సారి వైసీపీ పూర్తిగా సంక్షేమ లబ్దిదారులు- సామాజిక సమీకరణాల ఆధారంగా ఎన్నికలకు సిద్దం అవుతోంది. సామాజిక సమీకరణాలు కీలకమైన ఏపీలో ఇప్పుడు ఆప్ - బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే కొత్త రాజకీయం ముదలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో కేసీఆర్ ఎంట్రీ - పొత్తులు - రాజకీయ అడుగుల పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.