కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్ .. కారెక్కే కారణం అదే
తెలంగాణా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి గులాబీ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. 2014 ఎన్నికల్లో టీడీపీని ఖాళీ చేస్తే , తాజాగా 2018 లో జరిగిన తెలంగాణా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకున్నారు సీఎం కేసీఆర్ . ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తాజాగా మరో ముగ్గురు గులాబీ బాట పట్టారు.
చాలా కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పలు ఉన్నత పదవులు అనుభవించిన భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోటానికి రెడీ అయిపోయారు. అందుకు కారణం లేకపోలేదు పార్టీ మారితే ఆయన సతీమణి గండ్ర జ్యోతికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయన భార్యకు పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో వ్యూహాత్మక ఎత్తుగడగా గండ్ర వెంకటరమణా రెడ్డిని చాలా ప్లాన్డ్ గా టీఆర్ఎస్ ట్రాప్ చేసిందని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక ఆయన టీఆర్ఎస్ లోకి వస్తే ఆయన సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఇక ఈ ఎన్నికలలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెసు భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications