కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిశారు. కేసీఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని సీఈవోను కోరారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వికాస్ రాజ్ను కోరినట్లు వాసుదేవరెడ్డి తెలిపారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలకు కేసీఆర్ భరోసా కల్పిస్తారన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయిందని వాసుదేవరెడ్డి ఆరోపించారు.

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలకు తెలుసుకుంటానని కేసీఆర్ చెప్పారు.
సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకొని బస్సు యాత్ర కొనసాగనుంది. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయిస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని పోరాడేందుకు లీగల్ సెల్ ను ఇప్పటికే పటిష్టం చేసినట్లు కేసీఆర్ తెలిపారు. కేసులను ఎదుర్కొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకడాకుండా కార్యకర్తలకు కాపాడుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications