అన్నా! నేనొచ్చిన: విద్యాసాగర్ రావుకు కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ సలహదారు ఆర్ విద్యాసాగర్ రావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం పరామర్శించారు. 'విద్యన్నా.. నేను కేసీఆర్నొచ్చిన' అంటూ ఆయనను అప్యాయంగా పలకరించారు.
కేసీఆర్ పరామర్శ
అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యాసాగర్రావును మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ పరామర్శించారు.
కేసీఆర్ మాటలతో కదలిక..
కేసీఆర్ మాటలు విన్న విద్యాసాగర్రావు కాళ్లు, చేతులు కదిలించారు. కళ్లలోనూ కదలిక కనిపించినట్లు వైద్యులు తెలిపారు. విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
వెంటిలేటర్ తొలగించినా..
విద్యాసాగర్ రావు.. మంగళవారం ఉదయం వెంటిలేటర్ తొలగించినా కొద్దిసేపు స్వతహాగా శ్వాస తీసుకోగలిగారని వైద్యులు తెలిపారు. ఇదే తరహాలో చికిత్సను కొనసాగిస్తామని ఆస్పత్రిలో నిర్వాహకుడు గురురెడ్డి, ఇతర వైద్యులు చెప్పారు.
త్వరగా కోలుకోవాలి...
విద్యాసాగర్ రావుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. చికిత్స అందుతున్న తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేసి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యాసాగర్ త్వరగా కోలుకుని యథావిధిగా జీవితం గడపగలుగుతారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం వెంట ఎంపీలు వినోద్కుమార్, గుత్తాసుఖేందర్రెడ్డి, తదితరులు ఉన్నారు.