బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ - కేటీఆర్ కు కొత్త బాధ్యతలు..!?
తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరంగా కీలక మార్పులకు మాజీ సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో ఎదుగుతున్న క్రమంలో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దూకుడుగా వ్యవహరించేలా కార్యాచరణ సిద్దం చేసారు. పార్టీలో కీలక పదవుల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు.
కేసీఆర్ కొత్త లెక్కలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరో మూడు నెలల కాలంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్ సభ పైన ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషించేలా సూచనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పుంజుకోవటంతో పార్టీ తిరిగి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే నష్టం తప్పదనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో..లోక్ సభ ఎన్నికల అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికల్లో బలం చాటకుంటే బీఆర్ఎస్ నుంచి జింపింగ్స్ పెరుగుతాయనే అభిప్రాయం ఉంది. దీంతో, పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్ - హరీష్ బాధ్యతల మార్పు పైన కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

హరీష్ కు కీలక బాధ్యతలు..!
ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హరీష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేటాయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో కేడర్ లో హరీష్ నాయకత్వం పైన నమ్మకం ఉంది. కేడర్ తోనూ హరీష్ కు సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీకి పలు సందర్భాల్లో హరీష్ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పూర్తిగా కేడర్ - ప్రజల మధ్యనే ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతల నిర్వహణకు కేసీఆర్ సిద్దమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆ సమావేశాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కీలకంగా మారనున్నాయి.
పార్లమెంట్ కు కేటీఆర్..!
కేటీఆర్ ను లోక్ సభకు పంపాలనేది కేసీఆర్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, కేసీఆర్ పోటీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాజాగా హరీష్ స్పష్టత ఇచ్చారు. కవితను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ..కేటీఆర్ ను లోక్ సభ బరిలో దించటం ద్వారా పార్లమెంట్ లోనూ పార్టీ వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మహారాష్ట్రలోని లోక్ సభ సీట్లలోనూ బీఆర్ఎస్ పోటీ చేయనుండటంతో కేటీఆర్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలనేది కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, మరో వారం రోజుల్లోనే కేసీఆర్ పార్టీ పరంగా తీసుకొనే నిర్ణయాల తో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications