ధనిక రాష్ట్రం, సీఎం ఇంటికి కూడా సౌకర్యాల్లేవ్, ఏపీతో ఇబ్బందులు: కెసిఆర్
హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదును, తెలంగాణను పూర్తిగా విస్మరించారని, సమైక్య పాలకులు చేసిందేమీ లేదని, ముఖ్యమంత్రి నివాసానికి కూడా కనీస సౌకర్యాలు లేవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. ఆయన మాజీ సైనికోద్యోగులతో సాయంత్రం భేటీ అయ్యారు.
మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏ1 రాష్ట్రమని సర్వేలు తేల్చాయన్నారు. సాగునీటి రంగం పైన సమైక్య పాలకులు శీతకన్ను వేశారని, అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదని, ప్రాజెక్టులు పూర్తి కావొద్దనే అలా చేయలేదని ఆరోపించారు.
నేడు తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్కు పునాది అవుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సాగునీటి విషయంలో తీరని అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం తెలంగాణకు 1,280 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించామని ప్రాజెక్టుల వారీగా లెక్కలు చెప్పారని తెలిపారు.
మనకు ఏది కేటాయిస్తే అది చాలంటున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కోతలు లేని కరెంట్ అందిస్తున్నామని, 2018 నాటికి మిగులు విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇంటింటికి నల్లాల ద్వార నీరు అందించేందుకు తాగునీటి ప్రాజెక్టును రూపొందించామన్నారు. హడ్కో, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని, భవిష్యత్లో రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 58 వేల కోట్లకు పెరగనుందన్నారు. ఉన్నతంలో వ్యూహం వేసుకుని తెలంగాణ ముందుకు పోతోందన్నారు.
దేశ రక్షణ కోసం సైనికులు క్రమశిక్షణతో పని చేశారన్నారు. మాజీ సైనికుల సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని, ఇందుకోసం ప్రభుత్వంతో చర్చించేందుకు ఆరుగురిని వారే ఎంపిక చేయాలన్నారు. భవిష్యత్లో వారు ప్రభుత్వానికి, మాజీ సైనికులకు మధ్య వారధిగా వ్యవహరిస్తారన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రస్తుతం ఇస్తోన్న రూ.3 వేల గౌరవ భృతిని రూ.6 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వామ్యం కావాలని, రాష్ట్రం ఎదుర్కొంటోన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం మాజీ సైనికుల సహకారం తీసుకుంటామన్నారు.