పైరవీ రాయుళ్లకు కేసీఆర్ 'పంచ్': అలాంటి ఫైళ్లతో వస్తే 'నో అపాయింట్మెంట్'
పైరవీ ఫైళ్ల మీద పెట్టే ఫోకస్ కాస్త నియోజకవర్గాల మీద పెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్.. పలువురు పార్టీ నేతలను మందలించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: రాజకీయాలంటేనే పైరవీలతో ముడిపడి ఉన్న వ్యవహారం. టికెట్ దక్కించుకోవడం దగ్గరి నుంచి.. ఎన్నికల్లో గెలిచేదాకా అడుగడుగునా పైరవీ రాజకీయాలే. అన్ని కలిసొచ్చి.. అధికార పగ్గాలు చేతికొచ్చాయంటే.. మరో రకం పైరవీలు మొదలైపోతాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ఇష్టారీతిన వ్యాపారాలు విస్తరించుకోవడానికో.. అనుచరగణానికి మేలు చేకూర్చేలా లాబీయింగ్ చేయడానికో.. నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.
ఇదే తరహాలో పైరవీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కొంతమంది పార్టీ నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారట. ఏకంగా రాజకీయాలు కావాలా? వ్యాపారా కావాలా? తేల్చుకోమంటూ అల్టిమేటం జారీ చేశారట. గులాబీ దళపతికి అంతలా కోపం తెప్పించిన ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ఈ విషయంలో కాస్త పట్టువిడుపు గానే వ్యవహరించిన కేసీఆర్.. ఇకనుంచి పైరవీ రాజకీయాలను ఏమాత్రం ప్రోత్సహించేది లేదని తెగేసి చెబుతున్నారట.
వ్యాపారాలు.. వర్గ ప్రయోజనాలు:
వ్యాపార ప్రయోజనాల కోసం.. తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం.. ఇటీవల పదేపదే కేసీఆర్ వద్ద పైరవీలు చేయడం పలువురు నేతలకు అలవాటుగా మారిపోయిందట. తొలి నుంచి ఈ వ్యవహారం పట్ల సీఎం కేసీఆర్ కాస్త మెతక వైఖరితోనే ఉండటంతో.. ఇక ఈ పైరవీ రాయుళ్లు మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారట. చీటికి మాటికి ఏదో ఫైల్ పట్టుకొచ్చి.. పనులు చేయించుకోవాలని చూస్తున్నారట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కేసీఆర్.. పైరవీల పేరుతో క్యాంప్ ఆఫీస్ కు వచ్చేవాళ్లకు అసలు అపాయింట్ మెంట్ ఇవ్వవద్దంటూ అల్టిమేటం జారీ చేశారని చెబుతున్నారు.
ఎవరా ఎంపీ? ఎమ్మెల్సీ?:
కేసీఆర్ వద్దకు పదేపదే పైరవీ ఫైళ్లను మోసుకొస్తున్నవారిలో ఓ ఎంపీ, మరో ఎమ్మెల్సీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారెవరనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. కుల ప్రయోజనాల్లో తలమునకలై ఒకరు, తన విద్యా సంస్థల ప్రయోజనం కోసం మరొకరు చీటికిమాటికి కేసీఆర్ వద్దకు వస్తున్నారట. తొలినాళ్లలో వీరి వ్యవహారాన్ని అంత సీరియస్ గా తీసుకోని కేసీఆర్.. వీరి ఆగడాలు మరింత శృతిమించిపోతుండటంతో.. ఇలాంటి పోకడలకు ఇక బ్రేక్ వేయాల్సిందేనని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే పైరవీ రాయుళ్లను దూరం పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అపాయింట్ మెంట్ ఇచ్చేది లేదు:
బదిలీ సిఫారసులకు సంబంధించిన ఫైళ్లతో ఓ ఎంపీ ఇటీవల కేసీఆర్ వద్దకు వచ్చారట. తొలుత ఈ విషయంలో కేసీఆర్ సానుకూలంగానే స్పందించినప్పటికీ.. ఆ తర్వాతే ఆయనలో అసలు అనుమానం మొదలైంది. బదిలీ సిఫారసుల వ్యవహారాన్ని లోతుగా తరచి చూస్తే.. అన్నీ ఒకే కులానికి చెందినవారివి ఉన్నాయట. దీంతో ఆ ఫైళ్లను పక్కనపెట్టేసి.. మరోసారి ఆ ఎంపీకి అపాయింట్ మెంట్ ఇవ్వవద్దని తన సిబ్బందికి చెప్పినట్లు సమాచారం.
నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టండి:
పైరవీ ఫైళ్ల మీద పెట్టే ఫోకస్ కాస్త నియోజకవర్గాల మీద పెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్.. పలువురు పార్టీ నేతలను మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిత్యం ప్రగతి భవన్ వద్ద తచ్చాడే ఓ ఎమ్మెల్యేను సీఎం పూర్తిగా దూరం పెట్టేశారట. నేతలెవరూ క్యాంప్ ఆఫీస్ వద్దకు రావద్దని, నియోజకవర్గాల్లో పనులపై ఫోకస్ చేయాలని హితవు పలికారట. దీంతో పైరవీ రాయుళ్లంతా ఉసూరుమంటున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఎలాగోలా కేసీఆర్ అపాయింట్ మెంట్ సంపాదించినా.. రాజకీయాలు కావాలో? వ్యాపారాలు కావాలో? తేల్చుకోవాలంటూ కేసీఆర్ ముఖం మీదనే చెప్పేస్తున్నారట. దీంతో కుక్కిన పేనులా నేతల నోట మాట పెగట్లేదని సమాచారం.