పత్రికలపై వ్యాఖ్య: తలసాని దూకుడుకు కెసిఆర్ బ్రేక్లు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న తలసాని శ్రీనివాస యాదవ్ దూకుడుకు ముఖ్యమంత్రి కె. చంద్రసేఖర రావు కళ్లెం వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారంనాడు జరిగిన సంఘటనను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది.
సోమవారం హైదరాబాదులోని సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐడిహెచ్కాలనీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి తలసాని పట్ల వ్యవహరించిన తీరు కూడా ఆ విషయాన్ని పట్టిస్తోంది. సభావేదికపై ముఖ్యమంత్రి ఆశీన్నులైన తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని ఐడిహెచ్కాలనీ డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తికావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి కెసిఆర్కే దక్కుతుందని చెబుతూ ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కెసిఆర్ పాలన సాగుతోందని, కానీ కొన్ని పత్రికలకు కళ్లు కన్పించటం లేదని వ్యాఖ్యానించారు. దాంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అలాంటి వ్యాఖ్యలు అవసరం లేదంటూ, ప్రసంగాన్ని తొందరగా ముగించాలని తలసానికి చెప్పమంటూ మంత్రి పద్మారావుకు చెప్పారు. దీంతో పద్మారావు మంత్రి తలసాని వద్దకు వచ్చి ఆ విషయం చెప్పారు. వెంటనే తలసాని పత్రికలపై విమర్శలను వదిలేసి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి వివరించి, ప్రసంగాన్ని ముగించారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతుండగా పక్క వీధిలో నుంచి భారీగా టపాసుల మోత విన్పించింది. దీంతో సిఎం తన ప్రసంగాన్ని ఆపి, ఏం శ్రీను ఎవరయాఆడు? మనోడేనా? లేక మరెవడైనా మోపయ్యాడా? అంటూ అడిగారు. దీంతో మంత్రి తలసాని జోక్యం చేసుకుని వారు మనవారేనని, ఇళ్లు వచ్చిన సందర్భంగా పటాకలు కాల్చుతున్నారంటూ సమాధానం చెప్పబోయారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ పనిపాట లేని కొందరు అక్కడక్కడ ఉంటారు కదా! అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, సిఎం స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తున్న సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అనురాధ, పుష్పలత తాము ముఖ్యమంత్రిని కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగగా, అది గమనించి అక్కడకు వచ్చిన మంత్రి తలసానిని మహిళలు నిలదీశారు. దీంతో వారిని శాంతింపజేసేందుకు మంత్రి తలసాని వారి చేతుల్లో ఉన్న దరఖాస్తులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.