కాంగ్రెస్ది అనవసర రాద్దాంతం.. జానారెడ్డి గట్లనే మాట్లాడ్తరా?: కేసీఆర్
రైతు రుణమాఫీలో 75శాతాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు ఏర్పాటు చేస్తుంటే.. పాడిందే పాడరా.. అన్నట్టు కాంగ్రెస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం నాడు రైతు రుణమాఫీ అంశం చర్చకు వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత జానారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇంతకుమించిన అంశమేది లేనట్టు సభలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని జానారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన జానారెడ్డి.. మా ప్రభుత్వ హయాం అయిపోయి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా! ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. మొత్తానికి రైతు రుణమాఫీ అంశం ఇరువురి మధ్య ఒకింత మాటల యుద్దానికి తెరలేపింది.

కేసీఆర్ ఏమన్నారంటే!:
ఏనుగు దూరి తోక చిక్కినట్టు.. రైతు రుణమాఫీలో 75శాతాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు ఏర్పాటు చేస్తుంటే.. పాడిందే పాడరా.. అన్నట్టు కాంగ్రెస్ సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఇదేదో బ్రహ్మపదార్థం అయినట్టు ఇంతకుమించి లేనేలేనట్టు సభలో అనవసర రాద్దాంతం చేస్తున్నారు. ఎన్నో పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గట్లనే మాట్లాడ్తరా?'

కేసీఆర్ వ్యాఖ్యలపై జానారెడ్డి:
ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అట్లా.. ఇట్లా.. అంటూ చెప్పిందే చెప్పి.. అన్నదే అని..ఏంటిది? మా ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లిస్తున్నారు. ఇదేనా పద్దతి?'

టీడీపీకి కేసీఆర్ కు అదే తేడా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుణమాఫీపై కేసీఆర్-జానారెడ్డి మధ్య చర్చ అనంతరం దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తాను టీడీపీలో ఉన్నప్పటి పరిస్థితి గురించి చెబుతూ.. అప్పటి
సీఎంతో పోలిస్తే.. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరే మెరుగ్గా ఉందన్నారు. ఇచ్చిన హామీల్లో 98శాతం వరకు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పోచారం ప్రశంసించారు.

కాంగ్రెస్ హయాంలో 480కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ:
కాంగ్రెస్ హయాంలో 480కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పడితే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చెల్లించిందని పోచారం గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పోచారం తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. సరైన వివరాలు చెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పట్టుబట్టారు.












Click it and Unblock the Notifications