సీమాంధ్రులు, తెలంగాణవాళ్లు వేరుకాదు!: 'సెటిలర్స్'పై ఫైట్, ఎమ్మెల్యేలపై కెసిఆర్ అసంతృప్తి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అందరి చూపు ప్రధానంగా 'సెటిలర్స్' పైన పడింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీమాంధ్రల పైన తీవ్ర విమర్శలు చేసిన తెరాస నేతలు కూడా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సాఫ్టుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు సీమాంధ్రుల పైన ఇష్టారీతిగా మాట్లాడిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా అందరూ సెటిలర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వం సీమాంధ్రులు, తెలంగాణ వారిని వేర్వేరుగా చూడదంటున్నారు. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్లు కీలకం కావడమే కారణమంటున్నారు.
తెలంగాణ వస్తే ఇక్కడి సీమాంధ్రులను తెరాస తరిమేస్తుందని కొందరు ఆరోపించారని, కానీ ఇప్పుడు తమ పాలనలో సెటిలర్స్ హాయిగా జీవిస్తున్నారని మంత్రులు చెబుతున్నారు. సెటిలర్స్కు తమ పార్టీ వల్లే రక్షణ ఉంటుందని భావిస్తున్నారని వారు అంటున్నారు.
అయితే, ఇన్నాళ్లు సెటిలర్స్ గురించి మాట్లాడని అధికార పార్టీ నేతలు తెలంగాణ వచ్చాక, ప్రధానంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్టిలో వారిని మచ్చిక చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగానే వారిపై ప్రేమను కురిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలో కెసిఆర్ సహా ఇతర నేతలు ఆంధ్రా బిర్యానీ పైన, ఆంధ్రా ప్రజల పైన చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుకు ఉన్నాయని కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న చోట తెరాస అభ్యర్థులే కార్పోరేటర్లుగా గెలిచే అవకాశాలున్నాయని, కాబట్టి అందరూ సెటిలర్స్ పైన దృష్టి సారించారని అంటున్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు గత ఏడాదిన్నరగా తెరాసలో చేరుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణా రెడ్డి వంటి వారు కారు ఎక్కారు. వీరిని తెరాస ఆకర్షించడం వెనుక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలేనని అందరు చెప్పుకొచ్చారు. ఇప్పుడేమే తెరాస సెటిలర్స్పై దృష్టి పెట్టిందంటున్నారు.
ఎన్నికల నేపథ్యంలోనే శనివారం నాటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు.
నెలాఖర్లోగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ జీతాలు పెంపు, రాజధానిలో ఆస్తి పన్నుకు పాక్షిక మినహాయింపు (రూ.1200 చెల్లించే వారు రూ.101 చెల్లిస్తే చాలు), నిరుపేదల నీటి, విద్యుత్ బకాయిలు రద్దు, క్షౌరశాలలు వాడే కరెంట్ డొమెస్టిక్ పరిధిలోకి తీసుకు రావడం, డిఎస్సీ పోస్టులు, రిజర్వాయర్లు ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల దృష్ట్యానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం ప్రచారం చేస్తారు: తలసాని
హైదరాబాదును ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేం 150 సీట్లలో పోటీ చేసి 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రచారం చేస్తారన్నారు. తమకు ఎవరితోను పొత్తు అవసరం లేదన్నారు. హైదరాబాదులో నీటి సమస్య తీర్చామని చెప్పారు. హైదరాబాదును విశ్వనగరంగా చేద్దామనుకుంటున్నామన్నారు.
గ్రేటర్లో గెలిచి తీరాలి: కెసిఆర్
అంతకుముందు టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా కావాలంటే గ్రేటర్లో గెలిచి తీరాలన్నారు. అప్పుడే హైదరాబాదును విశ్వనగరంగా చేయగలమన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో 150 డివిజన్ల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులను అప్పగించారు.