బొందుగాళ్లు వ్యాఖ్యలపై ఈసీకి కేసీఆర్ వివరణ
హైదరాబాద్ : కరీంనగర్ సభలో చేసిన హిందు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులకు సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరీంనగర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామరాజు ఫిర్యాదు చేశారు. దీంతో సీఈసీ కేసీఆర్ కు నోటీసులు జారీచేసింది.
కేసీఆర్ ఎక్స్ప్లానేషన్
హిందు వ్యాఖ్యలపై ఇవాళ సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్ కు టీఆర్ఎస్ నేతలు అందజేశారు. ప్రకాశ్ కు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తదితరులు కేసీఆర్ వివరణ కాపీని అందించారు.
ఏమన్నారంటే
లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ తో ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా బీజేపీని ఉద్దేశిస్తూ హిందుగాళ్లు, బొందగాళ్లు అని అన్నారు. బీజేపీ వాళ్లే దేవుడికి మొక్కుతారా ? మేం ఎవరం .. తిరుపతి, ఎములాడ వెళ్లమా .. దేవుడిని దర్శించుకోమా అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై వీహెచ్ పీ నేతలు అభ్యంతరం తెలిపి, ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ లక్ష్యంగా విమర్శలు
బీజేపీ లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హిందుత్వ పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటుందని ఆరోపించారు. కుల, మతాల పేర్లు చెప్పి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం చేపట్టారని గుర్తుచేశారు. కానీ రామ మందిరం నిర్మించలేదని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో అయోధ్యలో గుడికడుతామని హామీనిస్తారు .. తర్వాత విస్మరిస్తారు అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల వేళ .. మరోసారి మధ్యవర్తిత్వ కమిటీ పేరుతో వంచించారని విమర్శించారు కేసీఆర్.
ప్రాంతీయ పార్టీలదే హవా
అంతేకాదు .. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు కలిసి అధికారం చేపడితే .. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకోవచ్చునని తెలిపారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని విమర్శలు గుప్పించారు కేసీఆర్.