40ఏళ్ల సమస్యలపై అడుగు, టి-మహా గోదావరి బంధం: చంద్రబాబు చెప్పారు.. కెసిఆర్
ముంబై: గోదావరి నది పైన 5 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం.. మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. సహ్యాద్రి అతిథి గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు.
ఇరువురు సీఎంల సమక్షంలో ఎంవోయుపై సంతకాలు చేశారు. మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. గోదావరి జలాలను రాష్ట్రంలోని బీడు భూములకు మళ్లించే దిశగా ఒప్పందం కుదిరింది. గత నలభై ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించే దిశలో ఇరు ప్రభుత్వాలు ముందు అడుగు వేశాయి.
ఒకే గొడుకు కిందకు గత ప్రభుత్వాల ఒప్పందాలు, కొత్తగా చేపట్టపోయే ప్రాజెక్టులు రానున్నాయి. గత ప్రభుత్వ ఒప్పందాలకు ఇరు ప్రభుత్వాలు కట్టుబడనున్నాయి. కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అంశాలకు కొత్త బోర్డు పరిష్కారం చూపనుంది. ఎంవోయు అనంతరం ఇరువురు సీఎంలు మాట్లాడారు. కాగా, నాలుగు దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు అడుగు పడింది.
గత ఏడాదిగా మాట్లాడుతున్నాం: ఫడ్నవీస్
గత ఏడాదిగా తెలంగాణ సీఎం కెసిఆర్తో చర్చలు జరిపామని ఫడ్నవీస్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా చేసుకుంటున్నామని చెప్పారు.
కొత్త రాష్ట్రానికి ఎంతో మేలు: కెసిఆర్
ఈ ఒప్పందం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నానని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు. నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు ఈ ఒప్పందంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు తాను వ్యక్తిగతంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో నీటి సమస్య కూడా ప్రధాన అంశమని చెప్పారు. 2వేల నుంచి 4వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయన్నారు.
ఏపీ సీఎం కూడా చెప్పారు
సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారని వ్యాఖ్యానించారు. నీళ్లు వృథాగా సముద్రంలో పోయేకన్నా ఎవరు వాడుకున్నా మంచిదే అన్నారు. నూతన రాష్ట్రం తెలంగాణకు ఈ ఒప్పందంతో ఎంతో మేలు అన్నారు.
ఈ ఒప్పందం వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజమన్నారు. ఇరు రాష్ట్రాల్లోని గిరిజనులకు, ఇతరులకు మేలు జరుగుతుందన్నారు.
యావత్ దేశాన్ని నీటి సమస్య పట్టి పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని వాడుకుంటే ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా కేసిఆర్ మహారాష్ట్ర సీఎం, నీటి పారుదల శాఖ మంత్రిని హైదరాబాదుకు ఆహ్వానించారు.